వైసీపీ ఎమ్మెల్యే బాబూరావు అలక - టీటీడీ పదవి తిరస్కరణ : ఫలించని సాయిరెడ్డి బుజ్జగింపులు..!!
వైసీపీ సీనియర్ నేత..ఎమ్మెల్యే బాబూరావు అలకబూనారా. ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా తన నియామకాన్ని ఎందుకు తిరస్కరించారు. ఇప్పుడు ఇదే వైసీపీలో జరుగుతున్న హాట్ టాపిక్. సుదీర్ఘ కసరత్తు తరువాత ముఖ్యమంత్రి జగన్ టీటీడీ బోర్డును నియమించారు. రెగ్యులర్ సభ్యులుగా 25 మంది...ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందికి అవకాశం కల్పించారు. అందులో భాగంగా పార్టీ నుంచి మూడు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎంపిక చేసారు. అందులో పార్టీ ఏర్పాటు నుంచి జగన్ కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే బాబూరావు కు అవకాశం ఇచ్చారు.
తిరస్కరించిన బాబూరావు
అదే విధంగా ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ , కర్నూలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కి ఖరారు చేసారు. అయితే, తన పేరు ఎంపిక చేసారని తెలియగానే ఎమ్మెల్యే బాబూరావు ఆ పదవి తనకు వద్దంటూ తిరస్కరించి నట్లుగా చెబుతున్నారు. దీంతో..ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు అవకాశం ఇచ్చారు. గొల్ల బాబూరావు 2009లో కాంగ్రెస్ నుంచి పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ ను వీడి..జగన్ కు మద్దతుగా నిలిచారు
తొలి నుంచి జగన్ తోనే కలిసి
అనర్హత వేటు పడటంతో వైసీపీ లో చేరి 2012 ఉప ఎన్నికలోనూ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బాబూరావు వైసీపీ నుంచి అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసారు. కానీ, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో పాయకరావు పేట ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్ధి బంగారయ్య పైన గెలిచారు. ఆయన జగన్ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ లో జిల్లా నుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, విశాఖ జిల్లా నుంచి అవంతి శ్రీనివాస రావుకు ఛాన్స్ దక్కింది. ఆ తరువాత నియమించిన టీటీడీ బోర్డులో బాబూరావు పేరు వినిపించింది.
మంత్రి పదవి పైన ఆశలు..
ఏ కారణం చేతనోగానీ ఆయనకు బదులు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఎంపిక చేశారు. అప్పట్లో నిరాశ చెందిన ఆయనకు ఈ పర్యాయం అధిష్ఠానం అవకాశం కల్పించి టీటీడీ బోర్డుసభ్యుడిగా నియమించింది. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించటం ద్వారా ఇక, కేబినెట్ లో ఛాన్స్ ఉండదనే సమాచారంతో... ఆయన టీటీడీ పదవి తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఫలించని సాయిరెడ్డి ప్రయత్నాలు
ఈ విషయం తెలుసుకున్న ఏంపీ విజయసాయిరెడ్డి స్వయంగా బాబూరావుకు ఫోన్ చేయగా... ''నాకు టీటీడీ పదవి అవసరం లేదు'' అని ఫోన్ కట్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, జగన్ వెంట నడిచిన వారిలో తాను ఒకడినని..తనను చిన్నచూపు చూస్తున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. అప్పట్లో జగన్మోహన్రెడ్డిని తీవ్రదుర్భాషలాడిన వారికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవులు కట్టబెట్టారని, తనను మాత్రం పక్కన పెట్టారని వాపోయినట్టు చెబుతున్నారు.
మంత్రి పదవి ఇక రాదని నిర్ణయానికి
బాబూరావు అలక విషయం తెలుసుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసారని సమాచారం. ఆ సమయంలో తనకు టీటీడీ పదవి అవసరంలేదటూ బాబూరావు స్పష్టంగా చెప్పటం తో పాటుగా ..ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. రానున్న కాలంలో కేబినెట్ లో చోటు చేసుకొనే మార్పుల ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు ఎమ్మెల్యేలకు టీటీడీ లో స్థానం కల్పించినట్లుగా అంచనా వేస్తున్నారు.
మూడు ప్రాంతాల నుంచి ముగ్గురికి ఛాన్స్
బీసీ..రెడ్డి..ఎస్సీ వర్గాలు - మూడు ప్రాంతాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలని భావించినా... బాబూరావు నిర్ణయంతో ఇప్పుడు అదే సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చినా... ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో..బాబూరావు విషయంలో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇక, మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్న వారు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.