నెల్లూరులోను బాలయ్య హవా: చక్రం తిప్పడం వల్లే కోటంరెడ్డికి 'నుడా చైర్మన్'!
అధికారిక కమిటీ ఏర్పాటు తర్వాత పాలక వర్గాన్ని ఎన్నుకునేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన చాలామంది చైర్మన్ పోస్టు కోసం పోటీపడ్డారు.
నెల్లూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మద్దతుగా నిలవడంతో.. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ పదవి కోసం టీడీపీకి చెందిన పలువురు నేతలు పోటీ పడగా.. బాలయ్య జోక్యంతో ప్రభుత్వం కోటంరెడ్డికే బాధ్యతలు అప్పగించింది.
సభ్యులుగా నియమితులైన ముగ్గురిలో.. మిత్రపక్షమైన బీజేపీకి కూడా అవకాశం దక్కింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ నియామకాన్ని చేపట్టినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. పదవీ కాలంపై మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. రెండేళ్ల పాటు మాత్రం అధికారంలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. పదవి దక్కడంపై కోటంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్తగా తనకు గుర్తింపునిచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పారు.
మంత్రి నారాయణ చొరవే:
నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు మంత్రి నారాయణ చొరవే ప్రధాన కారణం. తొలుత ప్రజాభిప్రాయసేకరణ మొదలుపెట్టి.. దానితో ముడిపడి ఉన్న ఇతర కార్యక్రమాలను త్వరగా పూర్తి చేశారు. అలా గత మార్చి నెలలో నుడా ఇన్చార్జి వీసీగా సీహెచ్ పెంచలరెడ్డితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లతోపాటు ఆర్ధిక శాఖ, ఇతర ముఖ్య శాఖల అధికారులను సభ్యులుగా చేరుస్తూ అధికారిక కమిటీని నియమించారు.
బాలయ్య జోక్యం:
అధికారిక కమిటీ ఏర్పాటు తర్వాత పాలక వర్గాన్ని ఎన్నుకునేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన చాలామంది చైర్మన్ పోస్టు కోసం పోటీపడ్డారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య జోక్యంతో కోటంరెడ్డికి లైన్ క్లియర్ అయింది. దీంతో ప్రభుత్వం కూడా కోటంరెడ్డికే అవకాశమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోని మిగతా నేతలకు బాలయ్య నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
బాలయ్యతో ఏకీభవిస్తూ..:
బాలయ్యతో ఏకీభవించేలా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సోమిరెడ్డి, నారాయణ అంతా కోటంరెడ్డికే మద్దతు తెలపడంతో.. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మహానాడుకు ముందే ఈ నియామకం చేపట్టాలని భావించినప్పటికీ పలు కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం నాడు నుడా చైర్మన్గా టీడీపీ నగరాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సభ్యులుగా కావలికి చెందిన పాలడుగు రంగారావు, నెల్లూరుకు చెందిన ఎస్కే ఖాజావలి, నాయుడుపేటకు చెందిన బీజేపీ నేత సన్నారెడ్డి దయాకర్రెడ్డి నియమితులయ్యారునియామకం పూర్తయింది.
బాలకృష్ష ఎందుకు మద్దతిచ్చారు?:
ఒకప్పుడు ఎన్ఎస్ యూఐ ద్వారా విద్యార్థి రాజకీయాలను కోటంరెడ్డి ప్రభావితం చేశారు. తద్వారా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. నెల్లూరు మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఆనం సోదరులను వ్యతిరేకించారు. అలా 2000లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలర్గా పోటీ చేసి ఆనం సోదరుడు ఆనం జయకుమార్రెడ్డిని ఓడించారు. తర్వాతి కాలంలో 2005లో నెల్లూరు నగరాధ్యక్షుడిగా నియమితులవడం, పలుమార్లు అధినేత చంద్రబాబు వద్ద ప్రశంసలు పొందడంతో.. బాలయ్యతో కోటంరెడ్డికి పరిచయం ఏర్పడింది. అలా ఆయనతో ఏర్పడిన సాన్నిహిత్యమే తాజాగా ఆయనకు చైర్మన్ పదవి రావడంలో కీలక పాత్ర పోషించింది.