హిందూపురంపై ఎందాకైనా వెళతా- జగన్నూ కలుస్తానన్న బాలకృష్ణ...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను పార్లమెంటు స్ధానాల వారీగా విభజించాలని భావిస్తున్న ప్రభుత్వం... 25 లేదా 26 జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయనం చేసేందుకు కమిటీలను కూడా నియమించింది. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో కమిటీలు జిల్లాల ఏర్పాటు కోసం వివరాలు కూడా సేకరిస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త జిల్లాల డిమాండ్లు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న హిందూపురం పార్లమెంటు స్ధానాన్ని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. స్ధానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఇప్పటికే పలుమార్లు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ మేరకు కొత్త జిల్లా ఏర్పాటుపై డిమా్ండ్ చేయడంతో పాటు సీఎం జగన్కు లేఖ కూడా రాశారు. అదే సమయంలో ప్రభుత్వంపై హిందూపురం జిల్లా కోసం ఒత్తిడి పెంచేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారు.
హిందూపురం జిల్లా కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని బాలకృష్ణ ఇవాళ ప్రకటించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన బాలకృష్ణ... కొత్త జిల్లా కోసం అవసరమైతే సీఎం జగన్ను కలిసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కక్షసాధింపులు నడుస్తున్నాయని, అభివృద్ధి కంటే ఇవే ఎక్కువయ్యాయని బాలకృష్ణ ఆరోపించారు. కష్టకాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాని బాలకృష్ణ కోరారు.