జగన్ పార్టీకి ఎమ్మెల్యే బాలకృష్ణ షాక్, ఉబెర్తో నారా లోకేష్ ఒప్పందం
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. చిలమత్తూరు మండలంలోని కోడూరు 1, 2 మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైసిపి సభ్యులు సూర్యనారాయణ, చెన్నకృష్ణ టిడిపిలో చేరారు.
చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబాను, చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసిపి ఎంపీటీసీలు హైదరాబాదుకు వెళ్లారు. జూబ్లీహిల్స్లోని బాలకృష్ణ నివాసంలో ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీపీ నౌజియా భాను మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.
శిక్షణ నైపుణ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ - ఉబెర్ ఒప్పందం
కారు డ్రైవింగ్లో యువతకు శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ - ఉబెర్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
తెలుగు రాష్ట్రాల్లోని 30వేల మంది యువతకు శిక్షణ ఇప్పించేలా రెండు సంస్థలు ప్రణాళికలు రూపొందించాయి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ - ఉబెర్ సంస్థలు ఈరోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఉబెర్ బోర్డు డైరెక్టర్ డేవిడ్ ప్లఫ్ పాల్గొన్నారు.