అమరావతి నిరసనల్లో బాలకృష్ణ: సీఎం జగన్ లక్ష్యంగా: సీమ వాయిస్ వినిపిస్తారా..!
మూడు రాజధానుల ప్రతిపాదన..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు పైన అక్కడి రైతలు 30 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు రైతులకు మద్దతుగా ఆ ప్రాంతాల్లో పర్యటించి..దీక్షల్లో పాల్గొన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి..లోకేశ్ సతీమణి బ్రాహ్మణి సైతం రైతులకు మద్దతుగా వారి నిరసనలకు హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం అమరాతి గ్రామాల్లో రైతులకు మద్దతుగా నిలిచారు.
ఇక, ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు.. హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రైతులకు మద్దతుగా అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. రైతులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొననున్నారు. ఆయన ముఖ్యమంత్రిని జగన్ లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతారని తెలుస్తోంది. బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన అమారవతిలో చేసే ప్రసంగం కీలకం కానుంది.
అమరావతి నిరసనల్లో బాలకృష్ణ
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే టీడీపీతో సహా జేఏసీ నేతలు అమరావతికి మద్దతుగా నిరసనల్లో పాల్గొం టన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో నందమూరి..నారా కుటుంబాలు ప్రతీ ఏటా సంక్రాంతికి నారావారి పల్లెకు వెళ్లి అక్కడ పండుగను జరుపుకొనే వారు.
పండుగ రోజు సైతం చంద్రబాబు కుటంబం
ఈ సారి మాత్రం అమరావతి రైతులతో కలిసి వారి నిరసనల్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి చేసుకోవటం లేదని ప్రకటించారు. పండుగ రోజు సైతం చంద్రబాబు కుటంబం..లోకేశ్ సతీమణి బ్రాహ్మణి తో సహా.. నందమూరి కుటుంబ సభ్యులు రైతుల నిరసనలో పాల్గొన్నారు. వారికి మద్దతు ప్రకటించారు. ఇక, ఈ రోజు బాలకృష్ణ తన సతీమణితో కలిసి అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళన కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొననున్నారు.
సీఎం జగన్ లక్ష్యంగా..
అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి ఆమోదం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం..వెంటనే అదే రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు తమ పార్టీ స్టాండ్ స్పష్టంగా చెబుతున్నారు.
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ లోని టీడీపీ నేతలు సైతం ఇదే వాదనకు మద్దతు ఇస్తున్నారు. సీమ ప్రాంతం నుండి టీడీపీకి ముగ్గురు సభ్యులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో చంద్రబాబు తో పాటుగా బాలకృష్ణ..పయ్యావుల ఉన్నారు. ఇక, ఇప్పుడు హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అమరావతి లో చేసే ప్రసంగం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.