ఎమ్మెల్యే భూమాకు గుండెపోటు: హైదరాబాద్కు తరలింపు
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి కర్నూలులోని క్రాంతినగర్లో జరిగిన ఇప్తార్ విందుకు భూమా నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి కాల్చారు. దాని వల్ల వచ్చిన పొగను పీల్చడం వల్లే ఆయన ఛాతీలో నొప్పి, శ్వాసకోశ సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది.
దీంతో కర్నూలులోని స్థానిక సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేర్పించారు. అనంతరం భూమాకు ఈసీజీ, స్కానింగ్ లాంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు ప్రమాదమేమీ లేదని వెల్లడించారు. అనంతరం కోలుకున్న ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
హైదరాబాద్కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన భూమా తనకేమీ కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. గడచిన ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన భూమా నాగిరెడ్డి ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
మరోవైపు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమె కూడా వైసీపీ టికెట్పై గెలిచినప్పటికీ, తండ్రిబాటలోని వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.