ఎందుకలా జరిగింది?: కావాలనే చేశారా!, ఎమ్మెల్యే బుచ్చయ్య అసంతృప్తి
కాకినాడ కార్పోరేషన్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ విస్మరించడం పలు అనుమానాలకు తావిచ్చింది.
రాజమండ్రి: కాకినాడ కార్పోరేషన్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ విస్మరించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై మేయర్ పేరును సీఎం చంద్రబాబు పేరు తర్వాత పేర్కొనాల్సి ఉండగా.. కమిషనరేట్ అధికారులు మాత్రం ఏడో పేరుగా పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆహ్వాన పత్రికల్లో ప్రోటోకాల్ ప్రకారమే పేర్లను పేర్కొన్న అధికారులు.. శిలాఫలకం విషయంలో మాత్రం ఎందుకిలా చేశారన్న చర్చ జరుగుతోంది. అధికారులు కావాలనే మేయర్ ను అవమానించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శిలాఫలకంలో సీఎం పేరు తర్వాత ప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండలి ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్చార్జి మంత్రి కిమిడి కళా వెంకటరావు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్కుమార్ పేరు ప్రస్తావించిన అనంతరం ఏడో పేరుగా మేయర్ పంతం రజనీ శేషసాయి పేరును ఏర్పాటు చేశారు.
పాలనా వ్యవహారాల్లో మేయర్ కు, కమిషనర్ కు మధ్య ఉన్న విభేదాల దృష్ట్యా.. మేయర్ పేరును కావాలనే పక్కకు పెట్టారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, మండలి ఇన్ చార్జీ చైర్మన్ సుబ్రహ్మణ్యంకు సైతం ఆహ్వానం ఆలస్యంగా అందిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఆయన కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా ఆహ్వానం పంపారని ఎస్పీ కార్యాలయం వద్ద కమిషనర్ వి.విజయరామరాజును సైతం నిలదీశారు. ఫ్లెక్సీల్లో కూడా తన ఫోటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆయన మండిపడ్డారు.