టిడిపికి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా...ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారం...
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఇటీవలే భీమడోలు కోర్టు ఓ కేసు విషయంలో రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టిడిపికి చింతమనేని వ్యవహారమే మరో తలనొప్పిగా పరిణమించింది. గతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులను మొండిగా ఎదుర్కొన్న టిడిపి చింతమనేని అంశం ఎన్నికల కమీషన్, కోర్టు ధిక్కారంతో ముడిపడి ఉండటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది.
Recommended Video
ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ టిడిపి నిజంగా నిబంధనల ప్రకారమే నడుచుకుంటే అనర్హత వేటు తప్పదు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే లేదా ఎంపికి కోర్టు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించినట్లయితే సదరు ప్రజాప్రతినిధి తన పదవికి అనర్హుడు అవుతాడు. అంతేకాదు అతడు ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా అనర్హుడవుతాడు. కానీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చింతమనేని విషయంలో టిడిపి ఆచితూచి వ్యవహరించక తప్పని స్థితి. కారణం ఈ పరిస్థితుల్లో చింతమనేనిపై అనర్హత వేటు పడితే అది పార్టీ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇవీ...ఈ కేసు పూర్వాపరాలు...
2011 నవంబర్ 26న దెందులూరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా చింతమనేని...మంత్రి వట్టి వసంతకుమార్పై దౌర్జన్యం చేయడమే కాకుండా అడ్డుకోబోయిన గన్మెన్ను పక్కకు నెట్టేశారు. దీంతో గన్మెన్ ఎం.సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చింతమనేని ప్రభాకర్తో పాటు మరో 14 మందిపై అప్పట్లో దెందులూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 218 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అధికారులెవరూ సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రాకున్నామాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. అలాగే దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా కోర్టు ముందు పెట్టడంతో చింతమనేనికి శిక్ష తప్పలేదు. చింతమనేని దాడికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారులు లభించడంతో భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె.దీప దైవకృప సంచలన తీర్పు చెప్పారు. ఓ సెక్షన్లో రెండేళ్లు జైలు-రూ.1000 జరిమానా, మరో సెక్షన్లో 6 నెలలు శిక్ష-మరో రూ.1000 జరిమానా, మూడో సెక్షన్లో మరో 6 నెలలు జైలు-500 జరిమానా విధించారు. అంటే, మొత్తం మూడేళ్ల జైలు శిక్ష. కోర్టు తీర్పుతో వెంటనే పిటిషన్ దాఖలు చేసి బెయిల్ తెచ్చుకున్నారు చింతమనేని.
అనర్హత వేటు...వెంటాడుతోంది...
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నిబంధనల ప్రకారం అయితే అనర్హత వేటు పడక తప్పదు. అయితే ఈ పరిస్థితుల్లో చింతమనేనిపై అనర్హత వేటు పడితే ఆ అంశం టిడిపిని అనేక విధాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అందుకే చింతమనేని కోసం కాకపోయినా పార్టీ ప్రతిష్ట దృష్ట్యా అయినా చింతమనేని పై అనర్హత వేటు పడకుండా చూడాలని టిడిపి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు టిడిపి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం...ఏం చెయ్యాలంటే...
ఈ జైలు శిక్ష విషయంలో నిబంధనల ప్రకారం ఏం చెయ్యాలంటే...కోర్టు తీర్పు అనంతరం న్యాయవాది, సభాపతి ఈ విషయాన్నిఎన్నికల కమీషన్ దృష్టికి వెంటనే తీసుకెళ్లాలి. దీంతో ఎన్నికల కమీషన్ కోర్టు తీర్పును ధృవీకరించుకొని సదరు శిక్ష పడిన ప్రజాప్రతినిధిని అనర్హునిగా ప్రకటిస్తుంది. ఈక్రమంలో చింతమనేనికి సంబంధించిన కోర్టు తీర్పు ధృవీకరణ పత్రాలు కూడా రోజుల వ్యవధిలోనే స్పీకర్ వద్దకు చేరుకున్నయని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎన్నికల కమీషన్ కు సమాచారం వెళితే అనర్హత వేటు తప్పదు కాబట్టి ఇంకా వెళ్లలేదట.
ముందు నుయ్యి...వెనుక గొయ్యి...అంటే ఇదేనా?...
చింతమనేని వ్యవహారంలో టిడిపికి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అంటే ఏమిటో తెలిసి వస్తోంది. నిబంధనల ప్రకారం ముందుకు వెళితే చింతమనేనిపై అనర్హత వేటు పడుతోంది. అప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరినట్లు అయి టిడిపి తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా చింతమనేని తరువాత ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హుడు అవుతాడు. అలాగని చర్య తీసుకోకుండా జాప్యం చేస్తే కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది. అంతేకాకుండా మళ్లీ ఈ వ్యవహారంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే తద్వారా మళ్లీ మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ఈ వ్యవహారంలో ఏం చెయ్యాలో టిడిపి తలబద్దలయ్యేలా తీవ్రంగా ఆలోచిస్తోందట. మరోవైపు ప్రతిపక్షాల నేతలు కూడా ఈ విషయంలో టిడిపి ఎలా వ్యవహరిస్తుందో అని నిఘా వేసి ఉంచాయట...ఇప్పటికే చింతమనేనిపై అనర్హత వేయాలంటూ ప్రధాన ప్రతిపక్షం వైసిపి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే...అంతేకాదు టిడిపి ఇలా జాప్యం చేస్తుందని తెలిసే తదుపరి చర్యకు వారు కూడా సమాయత్తమవుతున్నారట. దీంతో చింతమనేని విషయంలో...ఏ చేసినా...చెయ్యకున్నా...ఇబ్బంది పడే పరిస్థితి ఉండటంతో ప్రస్తుత తరుణంలో టిడిపికి మరో తలనొప్పిగా పరిణమించింది.