గన్మెన్లను వెనక్కి పంపి చింతమనేని కలకలం: ఎందుకలా? అలకపాన్పు వీడలేదా!
మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే చింతమనేని గన్ మెన్ లను వెనక్కి పంపారని కొంతమంది వాదిస్తుండగా.. చింతమనేని మాత్రం నాకు ప్రజలే రక్షణ గన్మెన్ లు అవసరం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఏలూరు: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా తయారైంది. మంత్రి పదవుల మీద గంపెడు ఆశలు పెట్టుకుని చివరకు అధినేత నిర్ణయంతో ఢీలా పడ్డ అసంతృప్త నేతలంతా ఏదో రూపంలో పార్టీ పట్ల నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి అధినేత చంద్రబాబు స్వయంగా మాట్లాడిన తర్వాత కూడా ఇదే తంతు కొనసాగుతుండటం ఆ పార్టీని మరింత కలవరపరిచే విషయం.
ప్రస్తుతానికైతే టీడీపీలో ఈ కలవరం రేపింది దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మంత్రిపదవి రాలేదని తెలిసిన వెంటనే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఆ తర్వాత అధినేతతో భేటీ తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్లుగానే కనిపించారు. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ.. గన్ మెన్ లను వెనక్కి పంపించి పార్టీలో కలకలం రేపారు.
మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే చింతమనేని గన్ మెన్ లను వెనక్కి పంపారని కొంతమంది వాదిస్తుండగా.. చింతమనేని మాత్రం నాకు ప్రజలే రక్షణ గన్మెన్ లు అవసరం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మళ్లీ బయటపడకపోయినా.. అంతర్గతంగా ఆయనలో మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి జ్వాల ఇంకా చల్లారనట్లుగానే కనిపిస్తోంది.
కాగా, ప్రస్తుతం చింతమనేనికి 2+2పద్దతిలో నలుగురు గన్ మెన్ ఉన్నారు. ఇద్దరు డ్యూటీలో ఉంటే మరో ఇద్దరు విశ్రాంతిలో ఉంటారు. ఇప్పుడు ఆ నలుగురిలో నుంచి ఇద్దరు గన్ మెన్ అవసరం లేదంటూ చింతమనేని వారిని వెనక్కి పంపారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని కారణంగా.. ప్రస్తుతానికి వారిద్దరు విధుల్లో ఎస్పీ భాస్కర్ భూషణ్ చెబుతున్నారు.