బకరా బతుకు అయిపోయింది: చింతమనేని, ఆగస్టు 13లోగా నివేదిక: హెచ్చార్సీ
హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన మహిలా ఎమ్మార్వోపై దాడి చేయించి విమర్శలను ఎదుర్కొంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. తనది బకరా బతుకైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులకు చేసే వారెవరైనా సహించేది లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలతో కంగారుపడ్డ చింతమనేని ప్రభాకర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎమ్మార్వో వనజాక్షి కంటతడి పెట్టడం తనను కలచివేసిందన్నారు.
గురువారం రాత్రి ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముసునూరు మండల తహసీల్దారు వనజాక్షితో తనకు ఎలాంటి వివాదం లేదని తేల్చేశారు. డ్వాక్రా మహిళలకు, రెవెన్యూ సిబ్బందికి నడుమ వివాదం చెలరేగడంతో విడదీసే ప్రయత్నం చేశానే తప్ప దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
దాడితో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు, రెవెన్యూ సిబ్బందికి మధ్య జరిగిన దాడిలో కిందపడ్డ ఎమ్మార్వో వనజాక్షిని తానే పైకి లేపానని తెలిపారు.
తనపై 17 కేసులు ఉన్నాయని, అంత మాత్రం చేత తాను దోషిని కాదన్నారు. ఎమ్మార్వోపై దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, చివరకు తనది బకరా బతుకు అయిపోయిందని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు.
ఎమ్మార్వోపై జరిగిన దాడి ఘటనపై హెచ్చార్సీ కూడా స్పందించింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎమ్మార్వోపై ఎమ్మెల్యే చింతమనేని దాడికి పాల్పడ్డారా? లేదా? అనే విషయమై పూర్తిస్ధాయి నివేదికను ఆగస్టు 13లోగా అందజేయాలని మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది.
ఇది ఇలా ఉంటే ఎమ్మార్వో వనజాక్షికి, ఎమ్మెల్యే చింతమనేనికి నడుమ రాజీ కుదిర్చేందుకు టీడీపీ నాయకులు కొందరు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రయత్నించారు. అయితే ఇలాంటి విషయాల్లో రాజీపడితే భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగులపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందంటూ రెవెన్యూ అసోసియేషన్ నేతలు రాజీపడొద్దని ఎమ్మార్వోకి సూచించారు.