ముదురుతున్న వివాదం.. ఇదీ అసలు వాస్తవం.. కుట్రను బయటపెట్టిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కరోనా కేసులు రాజకీయ రంగు పులుముకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం,వైసీపీ నేతల నిర్వాకాల వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. అయితే సీఎం జగన్ సమర్థ పాలనను చూసి ఓర్వలేకనే టీడీపీ ఈ ఆరోపణలు చేస్తోందని వైసీపీ మండిపడుతోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.
ప్రతిపక్షాలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను టార్గెట్ చేయడంతో.. ఇరువురి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అటు సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థులు హఫీజ్ ఖాన్ను లక్ష్యంగా చేసుకోవడంతో.. ఈ వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఓ ఫోటోను తెర పైకి తీసుకొచ్చి ప్రత్యర్థులు హఫీజ్ ఖాన్పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే దీని వెనకాల అసలు వాస్తవం వేరే ఉందని వైసీపీ చెబుతోంది.
సోషల్ మీడియాలో దుష్ప్రచారం..
ఓ క్వారెంటైన్ సెంటర్లో ఓ నర్సు ముస్లిం పెద్దాయన కాళ్లు తాకుతున్నట్టుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అదే ఫోటోలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఉన్నారు. ప్రత్యర్థులు ఈ ఫోటోపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గరుండి మరీ ఓ నర్సుతో మత గురువు కాళ్లు పట్టించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆ నర్సు అంత పెద్ద తప్పు ఏమి చేసిందని.. ఒకవేళ తప్పుచేసినా శిక్షించడానికి ఎమ్మెల్యే ఎవరు అని నిలదీస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఆయనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవద్దని ప్రశ్నిస్తున్నారు.
అసలు వాస్తవం ఇదీ..
అయితే ఆ ఫోటో వెనకాల అసలు కథ వేరే ఉందని వైసీపీ స్పష్టం చేసింది. ఇటీవల కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ సందర్శించారు. క్వారెంటైన్ సదుపాయాలను పరిశీలించి.. అక్కడ వైద్య సౌకర్యాలు సరిగా అందుతున్నాయో లేదో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన అక్కడున్న సమయంలోనే.. ఓ ముస్లిం పెద్దాయన కాలికి గేట్ తగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో విధుల్లో ఉన్న ఓ నర్సు గాయాన్ని శుభ్రపరిచి కట్టు కట్టింది. ఇదంతా ఎమ్మెల్యే అక్కడే ఉండి పరిశీలించారు. కట్టు కట్టాక కూడా రక్తస్రావం ఆగకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వాస్తవం ఇదైతే.. కొంతమంది కావాలనే ఎమ్మెల్యేను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదివరకే ఎమ్మెల్యే వార్నింగ్..
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల ఇదివరకే సీరియస్గా స్పందించారు. కరోనా కేసులు పెరగడానికి తానే కారణమంటూ ప్రచారం చేయడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవలే సవాల్ కూడా చేశారు. నిరాధారణ ఆరోపణళలతో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Recommended Video
ముదురుతోన్న వివాదం..
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా హఫీజ్ ఖాన్పై తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో కేసుల సంఖ్య పెరుగుతుంటే.. హఫీజ్ ఖాన్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. కరోనా కేసులు పెరగడానికి కారణం ఆయనేనని అందరికీ తెలుసన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన హఫీజ్ ఖాన్.. కేసులు పెరగడానికి కారణం తానే అని నిరూపిస్తే.. కర్నూలు సెంటర్లో ఉరేసుకోవడానికి రెడీ అని సవాల్ విసిరారు. అందరికన్నా ముందు తానే మసీదులు బంద్ చేయించానని చెప్పారు. తబ్లిగీ జమాత్ నుంచి వచ్చినవారి ఇంటింటికీ వెళ్లి.. 24 గంటల్లో వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు.