మరి కొద్ది గంటల్లో కిడారి, సోమ అంత్యక్రియలు...అరకుకు మంత్రుల పయనం
విశాఖపట్నం:మావోయిస్టుల చేతుల్లో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమకు మరి కొన్ని గంటల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు విశాఖపట్టణం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఆస్పత్రిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలకు పాడేరు ఆస్పత్రిలో పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో వీరి భౌతికకాయాలను స్వగ్రామాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మరికొన్ని గంటల్లో అంత్యక్రియలు ప్రారంభించనున్నట్లు అందుకు ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు కలెక్టర్ వివరించారు.
పోలీసుల వైఫల్యం లేదు: ఎమ్మెల్యే హత్యపై హోంమంత్రి, వారి పనేనా?
మరోవైపు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు మరి కాసేపట్లో ఇక్కడకు చేరుకోనున్నారు. పలువురు మంత్రులు ఒక ప్రత్యేక చాపర్ లో పాడేరుకు చేరుకోనున్నారని తెలిసింది. ఇప్పటికే విశాఖకు చేరుకున్నహోంమంత్రి చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, సుజయ్ కృష్ణారంగారావు, జవహర్...ఆ ప్రత్యేక చాపర్లో అరకుకు బయలుదేరి వెళ్లారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం దృష్ట్యా అమెరికా బయలుదేరి వెళ్లగా...అనూహ్యంగా ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండించిన సిఎం చంద్రబాబు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాజాగా న్యూయార్క్ లో జరిగిన ఎన్ఆర్ఐల సభలో సిఎం చంద్రబాబు మావోయిస్టుల హత్యాకాండ విషయమై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హత్యలకు తావులేదన్నారు.
ప్రాణం పోయలేనివారికి ప్రాణం తీసే హక్కు లేదని స్పష్టం చేశారు. నిర్మాణమే మన బాధ్యత కావాలే తప్ప విధ్వంసం నైజం కారాదని అన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలను అందరు ఖండించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా ఈనెల 26న కిడారి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ పరామర్శిస్తారని విశాఖ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.