ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు - ఈ సారి నేరుగా...!?
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపించారు.
నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో అధికారుల తీరు పైన ఆగ్రహం..వ్యాఖ్యలు...నిరసనలతో కోటంరెడ్డి హోరెత్తించారు. కోటంరెడ్డి నేరుగా ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ గురించి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..తాడేపల్లి నుంచి వచ్చిన పిలుపు రావటంతో వెళ్లి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అన్ని విషయాలు అడిగి తెలుసు కున్నారని..ఏమున్నా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రభుత్వం పై ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యల పై ఆగ్రహించిన సీఎం..ఆయన ప్రాతినిధ్య వహిస్తున్న వెంకటగిరి ఇంఛార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి అప్పగించారు. అన్ని రకాలుగా ఆనంకు అధికారాల్లో కోత పెట్టారు.
కొద్ది రోజుల క్రితం కోటంరెడ్డి మరోసారి పార్టీ సమావేశంలో జిల్లాలోని పెద్దలు తన గొంతు కోశారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని పదవులు వారి కుటుంబాలకే కావాలనే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ, ఇక అలా కుదరదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సైతం వైసీపీలో కలకలం రేపాయి. ఇప్పుడు తాజాగా తన ఫోన్ల పైన నిఘా పెట్టారంటూ కోటంరెడ్డి ఆరోపించారు. తానేమైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా అంటూ ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్లో మాట్లాడితే ఏం చేయగలరని ప్రశ్నించారు. మూడున్నార దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసంటూ చెప్పుకొచ్చారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తన పైన నిఘా ఏంటంటూ నిలదీసారు. నెల్లూరు జిల్లాలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీకి సమస్యగా మారతున్నాయి. నెల్లూరు రూరల్ -సిటీ నేతల మధ్య సమన్వయం లేదు. మాజీ - తాజా మంత్రి మధ్య సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. ఈ జిల్లా నేతల మధ్య సఖ్యత దిశగా స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా..ఈ జిల్లా నేతలు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ.. పార్టీలో చర్చకు కారణమవుతున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి తన ఫోన్ల పై నిఘా పెట్టారంటూ చేస్తున్న ఆరోపణలపైన ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.