బాబుకు పాదాభివందనం, లోకేష్ క్షమించు: తెరాసలో చేరిన ఎమ్మెల్యే కృష్ణారావు
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో టీడీపీకి నాయకత్వ లోపం ఏర్పడిందని, ప్రజల కోసం తీసుకున్న తన నిర్ణయాన్ని చంద్రబాబు, లోకేష్లు అర్థం చేసుకొని క్షమించాలని తెరాసలో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రబాబుకు పాదాభివందనం అంటూ టీడీపీ కార్యాలయానికి అతను ఓ ఫ్యాక్స్ పంపించారు. తెరాస చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై నియోజకవర్గం అభివృద్ధి కోసం తెరాసలో చేరినట్లు వివరణ ఇచ్చారు.
తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో పేద ప్రజలకు ఎలాంటి సహకారం అందించలేకపోతున్నానని, కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణారావుకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
కృష్ణారావు నివాసాన్ని ముట్టడించిన టీఎన్ఎస్ఎఫ్
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసాన్ని ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. టీడీపీ టిక్కెట్తో గెలిచి, పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణలో శాసనమండలికి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు తెరాస వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.