కావూరిపై దాడి: మాజీ ఎమ్మెల్యే రాజేష్ అరెస్టు
కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో పలువురు వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు. తమను పరుష పదజాలంతో దూషించిన కావూరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని మద్దాల రాజేష్ డిమాండ్ చేశారు. మద్దాల రాజేష్ అరెస్టుకు నిరసనగా బుధవారం చింతలపూడి బంద్ నిర్వహించారు.
కేంద్ర జౌళీశాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావుకు మంగళవారం సమైక్య సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో కావూరిని పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనం పైకి కోడిగుడ్లు విసిరారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై కావూరి సాంబశివ రావు తీవ్రంగా మండిపడ్డారు.