స్థానిక పోరు.. వారసుల జోరు: నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి కుమార్తె ఎంట్రీ..?
నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ వారసుల జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ వారసుల రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఈ ఎన్నికలను ఓ వేదికగా వినియోగించుకుంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ పదవి కోసం స్థానిక లోక్సభ సభ్యుడు. టీడీపీ సీనియర్ నాయకుడు కేశినేని నాని.. తన రెండో కుమార్తె శ్వేతను బరిలోకి దింపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
అటు ఆదాల.. ఇటు మేకపాటి..
అదే సమయంలో నెల్లూరు జిల్లాలో కూడా రాజకీయ వారసురాలి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమార్తె ఆదాల లక్ష్మీ రచన రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి కోడలు ఆమె. ఆదాల ప్రభాకర్ రెడ్డి సోదరుడి కుమారుడు వంశీధర్ రెడ్డి భార్య. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్గా హైదరాబాద్లో స్థిరపడ్డారు.
మర్రిపాడు నుంచి పోటీకి
జిల్లాలోని మర్రిపాడు జడ్పీటీసీ స్థానం నుంచి ఆమె పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం నామినేషన్ దాఖలు చేస్తారని అంటున్నారు. హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ.. నెల్లూరు జిల్లా రాజకీయాలపై అవగాహన ఉందని అంటున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆమె తన తండ్రి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మామ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం సాగించారు. జిల్లా రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారని చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు నుంచే జడ్పీ ఛైర్మన్ పదవి కోసం..
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. ఉన్న ఒకే ఒక లోక్సభ స్థానంలోనూ జెండా పాతింది. ఇప్పుడున్న పరిస్థితులు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించడం నల్లేరు మీద నడకే. అనుకూల వాతావరణం ఉండటంతో ఎన్నికలకు ముందు నుంచే జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం వైసీపీలో రేసు మొదలైంది.
Recommended Video
ఆనం, కాకాణి కుటుంబాల నుంచి పోటీ..
ఆదాల లక్ష్మీరచనకు ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబాల నుంచి తీవ్ర పోటీ ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ రెండు కుటుంబాలు కూడా జడ్పీ ఛైర్మన్ పదవిపై కన్నేశాయి. మరోవంక- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున కూడా ఈ పీఠం కోసం పోటీ పడొచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఆదాల రచనకు అవకాశాలు అధికంగా ఉండొచ్చని అంటున్నారు.