మహిళా ఎమ్మార్వోపై ఎమ్మెల్యే చింతమనేని దాడి: ఫోన్, కెమెరా ధ్వంసం
కృష్ణా: జిల్లాలోని ఓ మహిళా ఎమ్మార్వోపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. అక్కడే ఉండి, ఆ దృశ్యాలను ఫొటో తీస్తున్న ఓ మీడియా ప్రతినిధిపైనా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. కెమెరాను నేలకేసి కొట్టడం అది పగిలిపోయింది.
దీంతో మీడియా ప్రతినిధి.. పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా.. ఫోన్ కూడా విసిరేశారు. ముసునూరు మండలం రంగంపేటలో ఉన్న ఇసుక రీచ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.
ఆ విషయం తెలిసిన ఎమ్మార్వో వనజాక్షిని అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఆ అనుచరులు ఎమ్మెల్యేకు చెప్పడంతో ఆయన స్వయంగా మరికొంతమంది అనుచరులను తీసుకుని అక్కడకు వచ్చారు. ఎమ్మార్వోపై ప్రభాకర్ తదితరులు దాడి చేశారు.
ఇసుక అక్రమ రవాణాను ఎవరైనా అడ్డుకుంటే ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులకు తెలియడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. చింతమనేనిపై గతంలో ఏలూరు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది.
నన్ను ఈడ్చేశారు, ఫోన్ లాక్కున్నారు: ఎమ్మార్వో
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి తెలిపారు. తనను ఈడ్చేసి, తన ఫోన్ కూడా లాక్కుని విసిరేశారని చెప్పారు. జరిగిన ఘటనపై తాను కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.