"చేయని తప్పుకు రోజాకు శిక్ష!, బాబుకు ఎందుకంత భయం, గొంతు నొక్కాలనే"
ఇప్పటికే చేయని తప్పుకు రోజా 14నెలలు శిక్ష అనుభవించారని, మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెరపైకి తెచ్చి మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు అసెంబ్లీ నుంచి నిషేధించే ప్రయత్నం జరుగుతుండటంతో ఆ పార్టీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికార పార్టీ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి రోజా సస్పెన్షన్ వివాదంపై స్పందించారు.
అసెంబ్లీలో మహిళల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఆమె గొంతు నొక్కాలని అధికార పక్షం భావిస్తుందని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. ప్రజా సమస్యలపై గొంతు ఎత్తేందుకు ప్రభుత్వం తమకు అవకాశం ఇస్తుందని భావించామని, కానీ ప్రభుత్వ తీరు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉందని ఆమె పరోక్షంగా అభిప్రాయపడ్డారు.
సమస్యలను చర్చకు లేవనెత్తితే వాటిని పక్కదారి పట్టించేందుకు టీడీపీ వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దిగుతోందని ఆరోపించారు. ఇప్పటికే చేయని తప్పుకు రోజా 14నెలలు శిక్ష అనుభవించారని, మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెరపైకి తెచ్చి మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మరో ఏడాదిపాటు రోజాపై సస్పెన్షన్ విధించేందుకు ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం దారుణమని పుష్ప శ్రీవాణి అన్నారు. రోజా చేసిన తప్పేంటని ఈ సందర్బంగా ఆమె నిలదీశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, కాల్ మనీ, రిశితేశ్వరి మరణం, ఇలా వరుస ఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే రోజాపై కక్షపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
తాజా ఘటనల గురించి ప్రస్తావిస్తూ.. అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ వర్గం ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, దాని గురించి నిలదీసినందుకేనా రోజాను సస్పెండ్ చేసిందని ప్రశ్నించారు. లేక విశాఖ బీచ్ ఫెస్టివల్ ను అడ్డుకున్నందుకా? అని ప్రశ్నించిన పుష్ప శ్రీవాణి.. రోజాను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం? అన్నారు.
దళితుల సమస్యల కోసం ఏనాడు పనిచేయని ఎమ్మెల్యే అనిత ఈరోజు కేవలం రాజకీయ మైలేజ్ పొందడానికే రోజాను ఇరికిస్తున్నారని అన్నారు. హత్య చేసిన ఖూనికోరుకు ఒకేసారి శిక్ష వేస్తారని, దోషులకు సైతం శిక్ష విధించేటప్పుడు చివరికి కోరిక గురించి అడుగుతారని, అలాంటిది ఏకపక్షంగా రోజాను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. దీనిపై వివరణ కూడా అడగనందుకు మహిళగా సిగ్గుపడుతున్నానని అన్నారు.