జనసేన ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యల కలకలం: వంశీ బాటలోనే..! అధినేత సమర్ధతక పరీక్షగా..!
ఏపీ అసెంబ్లీలో జనసేనకు ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు ఆయన వైఖరి పార్టీ నేతల్లో అనేక సందేహాలకు కారణం అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాన్ కాకినాడ లో రైతు సౌభాగ్య దీక్ష చేసారు. ఈ దీక్షకు పార్టీ ఎమ్మెల్యే రాపాక హాజరు కాలేదు. తొలుత అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను దీక్షకు హాజరు కావటం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా..అసలు అధినేత దీక్ష గురించి తనకు సమాచారం లేదని రాపాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలోనే కాదు..రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారాయి.
ఇదే సమయంలో ఆయన జనసేన వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది..దీని పైన రాపాక ఫైర్ అయ్యారు. అయితే, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ తరహాలోనే రాపాక సైతం నడవబోతున్నారంటూ ప్రచారం అసెంబ్లీ లాబీల్లో హల్ చల్ చేస్తోంది. మరి..తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే వైఖరి విషయంలో ఇప్పుడు పార్టీ అధినేత పవన్ ఏం చేస్తారు..ఇప్పుడు ఇది ఆయన సమర్ధతకు పరీక్షగా మారుతుందనే అభిప్రాయం ఉంది.
సూట్కేస్.. సిమెంట్ కంపెనీలు పెట్టలేదు.. ఆ రోజు మీ సంగతి చూస్తాం.. సీఎం జగన్పై పవన్ ఫైర్
దీక్ష గురించి సమాచారం లేదు
కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష చేసారు. ఈ దీక్షకు పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సభలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ల పైన చర్చ సమయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ తరువాత మీడియా సంస్థలతో మాట్లాడుతూ అసెంబ్లీ ఉన్న కారణంగా తాను దీక్షకు వెళ్లటం లేదని చెప్పుకొచ్చారు. అయితే, గురు వారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత ఇదే విషయం పైన ఎమ్మెల్యే రాపాక భిన్నంగా స్పందించారు.
పవన్ కళ్యాన్ దీక్షపైన తనకు సమాచారం లేదని వ్యాఖ్యానించారు. నిజంగా ఆయనకు పార్టీ నుండి అధికారికంగా సమాచారం ఇవ్వలేదా..లేక రాపాక అధినేతతో కలిసి దీక్షలో పాల్గొనటం ఇష్టం లేకనే ఇలా చెప్పారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
వంశీ బాటలోనే అంటూ..లాబీల్లో
రాపాక తీరు పైన పార్టీ అధినేత సీరియస్ గా ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. పార్టీ శ్రేణులే తాను రాజీనామా చేస్తానంటూ ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే రాపాక తన సన్నిహితుల వద్ద అవేదన వ్యక్తం చేస్తు న్నట్లు సమాచారం. ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ పార్టీ లైన్ ను భిన్నంగా ముఖ్యమంత్రిని అభినందించారు. తాజాగా ఇంగ్లీషు మీడియం స్కూళ్ల విషయంలోనూ మద్దతుగా నిలిచారు.
జనసేన అధినేత పవన్ కాకినాడలో చేస్తున్న దీక్ష గురించి రాజకీయంగా చర్చ సాగుతున్న సమయంలోనే...సొంత ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో అసలు తనకు ఆ దీక్ష గురించి సమాచారం లేదని చెప్పటం ద్వారా ఆయన భవిష్యత్ నిర్ణయం మీద అనుమానాలు మొదలయ్యాయి. అయితే, రాపాక సైతం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ తరహాలోనే నడుస్తారనే చర్చ అసెంబ్లీ లాబీల్లో సాగుతోంది. అయితే, రాపాక మాత్రం పార్టీ మారే ఉద్దేశం లేదనే సంకేతాలిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు..
తన పార్టీ ఎమ్మెల్యే రాపాక విషయంలో జనసేనాని పవన్ ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. గతంలో ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే మీద కేసులు నమోదు చేసిన సమయంలో పవన్ తీవ్రంగా స్పందించారు. పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. అయితే, రాపాక మాత్రం సభలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా పార్టీ అంచనాకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఒక మంత్రితో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విషయంలోనూ ఎమ్మెల్సీ రాపాక తీరు మీద పవన్ ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీంతో..పాటుగా వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్యేను ట్రాప్ చేసిందనే అనుమానం జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి..ఇప్పుడు పవన్ కళ్యాన్ తమ ఎమ్మెల్యే విషయంలో ఏం చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.