కాంగ్రెస్కు ఎమ్మెల్యే గుడ్బై: విధ్వంసంపై కిరణ్ సీరియస్
ఏలూరు: కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసన సభ్యుడు పి రామాంజనేయులు కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేశారు. ఆయన ఇంతకుముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెసు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారు.
టిఎస్సార్ రాజీనామా
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామి రెడ్డి శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి పంపించినట్లు చెప్పారు. ఎపిని విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం తనతో పాటు అందర్నీ నిరాశపర్చిందన్నారు.
ఉద్యోగులు సమ్మె విరమించాలి: కిరణ్
విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. డిజిపి ప్రసాద రావుతో భేటీ అనంతరం ఆయన సమ్మె విరమించాలని కోరారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మానవదృక్పథంతో ఆలోచించి సమ్మెను విరమించాలన్నారు. సమ్మె ప్రభావం వివిధ విభాగాల పైన తీవ్రంగా పడుతుందన్నారు. కాగా, ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.