డిప్యూటీ సీఎంపై రోజా ఫైర్: నా నియోజకవర్గంలో పెత్తనం చేస్తారా: సీఎం హామీ ఇచ్చినా...అంతేనా..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ అయ్యారు. ఈ సారి చంద్రబాబు లేదా టీడీపీ మీద కాదు. తమ సాంత పార్టీ నేత..సొంత జిల్లా కే చెందిన ఉప ముఖ్యమంత్రి మీదనే టార్గెట్ చేసారు. చిత్తూరు జిల్లాలో కొంత కాలంగా పార్టీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత తనకు మంత్రి పదవి ఖాయమని భావించిన రోజాకు..జిల్లాలో రాజకీయ సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కలేదు. అదే జిల్లా నుండి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక శాఖలతో మంత్రి పదవి అదే విధంగా నారాయణ స్వామికి డిప్యూటీ సీఎం పదవి దక్కింది.
దీంతో..రోజా ఆవేదనకు గురయ్యారు. బుజ్జగింపుల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర స్థాయిలో కీలకమైన ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా..జిల్లాలో సాగుతున్న రాజకీయ పరిణామాల పైన మాత్రం రోజా అసహనంతోనే ఉన్నారు. ఇక, తాను ఇప్పటి వరకు బయట పడకుండా సంయమనం పాటిస్తూ వస్తున్నా తనలోని ఆగ్రహాన్ని బయటకు వెళ్లగక్కారు.
తన నియోజకవర్గంలోకి..చెప్పకుండా..
చిత్తూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విబేధాలు ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా కనిపింగా..ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా ఏకంగా తన లోని ఆగ్రహాన్ని బయట పెట్టారు. చిత్తూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే అయిన రోజాకు సమాచారం ఇవ్వకుండా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పుత్తూరులో పర్యటించారు.
ఈ విషయం తెలిసిన నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ఆమె ప్రశ్నించారు. తాను నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా కూడా తనను పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని రోజా ఆరోపించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా ఆకస్మికంగా పర్యటించారు. పుత్తూరులోని అంబేద్కర్ సంఘం తరపున దళితులకు కల్యాణ మంటప స్థల సేకరణ కోసం పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు. ఇదే..ఇప్పుడు రోజా ఆగ్రహానికి కారణమైంది. నేరుగా నారాయణ స్వామిని టార్గెట్ చేసారు.
రోజా అసలు లక్ష్యం ఆయనే..
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తనకు మంత్రి పదవి మొదలు..జిల్లాలో ప్రాధాన్యత తగ్గించేలా చేస్తున్న జిల్లాకు చెందిన కీలక నేత పైనే రోజా గుర్రుగా ఉన్నారు. ఆ నేతకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మద్దతుదారుడిగా ఉన్నారు. దీంతో..వారంతా ఉద్దేశపూర్వకంగానే తనను బలహీనపర్చే విధంగా వ్యవహరిస్తున్నారనేది రోజా ఆవేదనగా మద్దతుదారులు చెబుతున్నారు.
తనకు మంత్రి పదవి ఇవ్వని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ తన వద్దకు రోజాను పిలిపించి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోయిందీ వివరించారు. అదే సమయంలో నామినేటెడ్ పదవి అప్పగించారు. ఆ సమయంలో రోజా తన నియోజకవర్గం పరిధిలో మాత్రం ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని..తనకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు. దీనికి ముఖ్యమంత్రి సైతం వెంటనే హామీ ఇచ్చారు.
జగన్ వద్దకు పంచాయతీ
నగరి నియోజకవర్గంలో ఏ ఒక్కరూ రోజా ప్రమేయం లేకుండా జోక్యం చేసుకోకుండా తాను చూసుకుంటానంటూ సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు అప్పట్లోనే రోజా మద్దతు దారులు చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నారాయణ స్వామి తనకు సమాచారం లేకుండా తన సొంత నియోజకవర్గానికి రావటం పైన ఆగ్రహంగా ఉండటంతో పాటుగా..ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. మరి..ముఖ్యమంత్రి ఈ చిత్తూరు జిల్లా నేతల పంచాయితీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.