స్థానిక ఎన్నికలపై టీడీపీ పగటికలలు..మార్చిలోగా ఎన్నికల డిమాండ్ అందుకే: ఎమ్మెల్యే రోజా ధ్వజం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా మండిపడ్డారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కార్తీక మాసంలో శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చిలో పూర్తవుతున్న కారణంగా ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలు పగటికలలు కంటున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పు పట్టిన రోజా
ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న ఆమె తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడాన్ని కూడా తప్పు పట్టారు.చంద్రబాబు నాయుడు పై విరుచుకు పడిన రోజా చంద్రబాబు జీవితమంతా వెన్నుపోటు, శవ రాజకీయాలకే సరిపోయిందని విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా రాజకీయాలు నడుపుతున్నారని, తిరుపతిలో త్వరలో వెయ్యికాళ్ల మండపం ప్రారంభించేందుకు టీటీడీ చైర్మన్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు రోజా, రాష్ట్రంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
లోకల్ బాడీ ఎన్నికల కోసం చంద్రబాబు హడావిడి
జగన్ పార్టీ పెట్టిన నాటి నుండి రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధిగా ఉన్న ఏ కుటుంబంలో అయినా మరణం సంభవిస్తే అక్కడ ఎప్పుడూ వేరే పోటీ పెట్టలేదని, సదరు బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం తన సామాజిక వర్గం వారిని నిలబెట్టడం కోసం ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హడావిడి చేస్తున్నాడని రోజా మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి కరోనా కారణంగా రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో కూడా ప్రజలకు భరోసా కల్పించలేదని రోజా చంద్రబాబును ఎద్దేవా చేశారు.
నిమ్మగడ్డ సహకారంతో ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న భ్రమల్లో
కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా హైదరాబాద్లో దాక్కున్న చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని పేర్కొన్నారు రోజా. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహకారంతో మార్చి లోపల ఎన్నికలు నిర్వహిస్తే టిడిపి ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందని భ్రమలో ఉన్నారని, కానీ అది సాధ్యం కాదని రోజా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని వైసీపీ సర్కార్ ముందు ఎన్నికలు పెడితే కరోనా కుంటిసాకు చూపించి ఎన్నికలు వాయిదా పడేలా చేశారని, ఇప్పుడేమో ఎన్నికల కోసం ఆరాట పడుతున్నారని రోజా మండిపడ్డారు.
Recommended Video
అప్పుడు కరోనా కుంటిసాకుతో వద్దని , ఇప్పుడు కరోనా లేదంటూ ఎన్నికలకు వెళ్తారా ?
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా లేదని పెద్ద మనుషులు స్టేట్మెంట్ ఇవ్వడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేశారు అని పేర్కొన్న రోజా, రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ఇప్పటివరకు నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేశారని కితాబిచ్చారు. కరోనా సమయంలోనూ ప్రజల ఆదుకున్న సీఎం వైయస్ జగన్ మాత్రమే అని కొనియాడిన రోజా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై పగటి కలలు కంటోంది అంటూ ఫైర్ అయ్యారు.