సూపర్: లెక్చరర్గా మారిపోయిన రోజా: విద్యార్థులకు ఏం చెప్పారో తెలుసా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా శనివారం జూనియర్ కాలేజీ విద్యార్థులతో సరదాగా గడిపారు. ఉపాధ్యాయురాలిగా మారి, వారికి మార్గ నిర్దేశం చేశారు.
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా శనివారం జూనియర్ కాలేజీ విద్యార్థులతో సరదాగా గడిపారు. ఉపాధ్యాయురాలిగా మారి, వారికి మార్గ నిర్దేశం చేశారు.
కళాశాల ప్రారంభోత్సం
నగరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఈ భవనాలను ఎమ్మెల్యే రోజా శనివారం ప్రారంభించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్ధినులతో ముచ్చటించారు.
మంచి మాటలు..
చాక్పీస్ తీసుకుని బ్లాక్ బోర్డుపై ‘ఓం' రాసి ‘కలలు కనండి... సాకారం చేసుకోండి' అంటూ రాశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇదే చెప్పారని గుర్తు చేశారు. ‘ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. అనుకున్నది సాధించండి' అని చెప్పారు.
ఉత్సాహంగా రోజా
లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, ఆ దిశగా ముందుకు నడవాలని అన్నారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. కళాశాలలో ఉత్సాహంగా విద్యార్థులతో సంభాషణను కొనసాగించారు రోజా.
లెక్చరర్ కావాలనుకొని..
అంతేగాక, లెక్చరర్ కావాలనుకున్న తాను అనుకోకుండా సినీరంగం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా రోజా నగరి నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, తాజా రాజకీయా పరిణామాల నేపపథ్యంలో రోజాలో ఈ మార్పు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.