ఆ హామి ఇస్తేనే రోజాను సదస్సుకు అనుమతిస్తాం: వైసీపీ నేతలతో డీజీపీ
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలకు తావివ్వబోనని హామి ఇస్తేనే రోజాను సదస్సుకు అనుమతిస్తామని డీజీపీ అన్నారు.
విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు బయలుదేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పోలీసుల రూపంలో చుక్కెదురైంది. సదస్సుకు వెళ్లనివ్వకుండా గన్నవరం ఎయిర్ పోర్టులోనే రోజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి వేరే చోటుకు తరలించి ఆమెను నిర్బంధించారు.
విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. రోజాపై పోలీసు నిర్బంధాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలంతా ర్యాలీగా వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు. అక్రమంగా తమ ఎమ్మెల్యేను నిర్బంధించారని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు.
వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ సాంబశివరావు పలు వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే రోజాను హైదరాబాద్ తరలిస్తున్నామని, ఆమె పోలీసుల అదుపులోనే ఉన్నారని తెలిపారు. రోజా వల్ల పార్లమెంటీరయన్ల సదస్సుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ పేర్కొన్నారు.
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలకు తావివ్వబోనని హామి ఇస్తేనే రోజాను సదస్సుకు అనుమతిస్తామని డీజీపీ అన్నారు. ఇదిలా ఉంటే, పార్లమెంటేరియన్ల సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి మహిళా నేతలు హాజరవుతుండగా.. సొంత రాష్ట్రం నేతలను మాత్రం సదస్సుకు దూరంగా ఉంచాలని చూడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సదస్సుకు హాజరవడానికి హామి పత్రాలు రాసివ్వాల్సిన పరిస్థితి రావడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.