జగన్ కేబినెట్ లోకి రోజా..!! మంత్రులుగా అయిదుగురు మహిళలు : ఛాన్స్ దక్కేదెవరికి..!!
ఏపీలో జగన్ కేబినెట్ కొత్త కూర్పు సిద్దమవుతోంది. ఇప్పటికే సీఎం జగన్ మంత్రుల్లో కొందరు మినహా.. మిగిలిన వారిని తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేసారు. ఒకిరద్దరు మంత్రులతో సీఎం కేబినెట్ ప్రక్షాళన..గురించి డిస్కస్ చేస్తూ వారికి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఏపీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి పలు వేదికల ద్వారా చెబుతూ వచ్చిన సీఎం జగన్.. ఈ సారి కేబినెట్ లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుత ఏపీ కేబినెట్ లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ సంఖ్యను అయిదుకు పెంచాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
5 గురు మహిళా మంత్రులకు ఛాన్స్
ప్రస్తుతం ఇద్దరు ఎస్టీ వర్గానికి చెందిన పుష్ఫశ్రీ వాణి డిప్యూటీ సీఎంగా.. ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత హోం మంత్రిగా.. మరో ఎస్సీ మహిళా మంత్రిగా తానేటి వనిత ఉన్నారు. ఇక, కొత్త కేబినెట్ లో అయిదుగురు మహిళలకు.. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కేటాయించనున్నారు. ప్రస్తుతం వైసీపీలో శ్రీకాకుళం జిల్లా నుంచి రెడ్డి శాంతి, విశ్వసరాయి కళావతి (ఎస్టీ) వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
విజయనగరం నుంచి ప్రస్తుత మంతి పుష్ఫ శ్రీవాణి ఒక్కరే మహిళా ఎమ్మెల్యే. విశాఖ నుంచి ఎస్టీ వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూర్పు గోదావరి నుంచి సైతం ఎస్టీ వర్గానికి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి..పశ్చిమ గోదావరి నుంచి ప్రస్తుత మంత్రి తానేటి వనిత ఉన్నారు. గుంటూరు నుంచి ఉండవల్లి శ్రీదేవి..సుచరిత..విడదల రజనీ వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కడప నుంచి దాసరి సుధ.. కర్నూలు నుంచి శ్రీదేవి.. చిత్తూరు నుంచి రోజా.. అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ పద్మావతి.. ఉషాశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మూడు రీజియన్లకు ప్రాధాన్యత
అయితే, ఇప్పుడు మూడు రీజియన్ల నుంచి మహిళలకు ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎస్టీ వర్గానికి స్పీకర్ పదవి కేటాయిస్తే.. ఆ వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. స్పీకర్ గా బీసీ వర్గానికే కొనసాగిస్తే.. తిరిగి పుష్ఫశ్రీ వాణిని కొనసాగించటం లేదా.. రంపచోడవం ఎమ్మెల్యేకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఇక, ఎస్టీకి స్పీకర్ దక్కితే.. మహిళా కోటాలో ఎస్సీకి రెండు బెర్తులు... బీసీ వర్గానికి చెందిన వారికి రెండు పదవులు.. ఓసి ఒక పదవి కేటాయించనున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా.. ఎస్సీ - బీసీ వర్గాలకు చెందిన అనంతపురం జిల్లా మహిళా ఎమ్మెల్యేలు పద్మావతి - ఉషా శ్రీ చరణ్ లో ఒకరికి పదవి ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా.. బీసీ వర్గానికి రెండు సీట్లలో మరో సీటు గుంటూరు జిల్లాకు చెందిన విడదల రజనీ పేరు వినిపిస్తోంది.
రోజాకు లైన్ క్లియర్ అయినట్లేనా
ఓసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తొలి స్థానంలో ఉంది. తొలి సారి కేబినెట్ కూర్పు సమయంలోనే రోజాకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది. అయితే, చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంతో రోజాకు అవకాశం దక్కలేదు.
ఇప్పుడు పెద్దిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోది. పెద్దిరెడ్డి - బొత్సా - కొడాలి నానికి పార్టీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో..రోజాకు మహిళా కోటాలో చిత్తూరు నుంచి రూట్ క్లియర్ కానుంది. మొత్తం ఎస్టీ ఎమ్మెల్యేలు ఈ సారి వైసీపీ నుంచే గెలవటంతో.. ఎస్టీ వర్గానికి స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అది సమీకరణాల్లో సాధ్య పడకుంటే ఒక ఎస్టీ..ఒక ఎస్సీ.. ఇద్దరు బీసీ..ఒక రెడ్డి వర్గానికి చెందిన వారితో మొత్తంగా అయిదుగురు మహిళలకు కొత్తగా కేబినెట్ లో అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
సామాజిక సమీకరణాలే కీలకంగా
అదే విధంగా.. ఎమ్మెల్సీల నుంచి అవకాశం ఇవ్వాలంటే విశాఖ నుంచి వరుదు కళ్యాణి.. ప్రకాశం నుంచి పోతుల సునీత..కడప నుంచి జఖియా ఖానమ్ ఉన్నారు. అయితే, జఖియా ఖానమ్ డిప్యూటీ ఛైర్మన్ గా ఉండటంతో... మిగిలిన ఇద్దరూ బీసీ వర్గానికి చెందిన వారే. దీంతో.. రెడ్డి వర్గం నుంచి రోజా పేరు రేసులో ఉంది. ఎస్టీ వర్గం నుంచి ఉత్తరాంధ్రకే ఛాన్స్ దక్కనుంది.
మిగిలిన మూడు స్థానాల్లో బీసీ వర్గం నుంచి విడదల రజనీ..ఉషాశ్రీ చరణ్..పోతుల సునీత.. విడదల రజనీ పోటీలో ఉన్నారు. ఎస్సీ వర్గంలో గుంటూరు జిల్లా లేదా అనంతపురం కు చెందిన జొన్నలగడ్డ పద్మావతి పేరు పరిశీలించే ఛాన్స్ ఉంది. దీంతో..సీఎం జగన్ చివరి నిమిషంలో ఎటువంటి సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రులను ఎంపిక చేస్తారు..ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.