ఎమ్మెల్యే రోజా అలా చేసినా కేసుల్లేవు .. కానీ జేసీ విషయంలో దారుణం : మాజీ మంత్రి చినరాజప్ప ఫైర్
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై టిడిపి నేత, మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీ నేతలకు మరో న్యాయంలా పరిస్థితి ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మండిపడ్డారు.
మళ్ళీ జేసీని అరెస్ట్ చెయ్యటం దారుణం : చినరాజప్ప
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలపై ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించారు. బెయిల్ మీద కడప జైలు నుండి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగిన కారణాలతో మళ్లీ 24 గంటల్లోనే అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు తరలించడం దారుణమని చినరాజప్ప పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యే రోజా , మధుసూదన్ రెడ్డిలపై ఆరోపణలు
వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా, మధుసూదన్ రెడ్డి రోడ్ల మీద పడి ఊరేగింపులు చేసినా వారిపై ఎలాంటి కేసులు పెట్టలేదని చినరాజప్ప ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేసింది అని మండిపడిన ఆయన కావాలని ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణాలు
రాష్ట్రంలో సామాన్యులపై ప్రభుత్వ అధికారుల దాష్టీకాలు పెరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక లారీ ని అడ్డుకున్న దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేయించారని, గుంటూరు జిల్లాలో మైనారిటీ వ్యక్తిని సీఐ దుర్భాషలాడారని, రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని అయినా ప్రభుత్వం అవేమి పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు చినరాజప్ప.
పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్న సర్కార్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరుగుతున్నాయని ప్రభుత్వ వైఖరి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు గా ఉందని మాజీ మంత్రి చినరాజప్ప అసహనం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను దృక్పథం తో ముందుకు వెళుతోందని మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైతే ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై అధికార పక్షానికి వ్యతిరేకంగా గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్నారో వారిపై తప్పుడు కేసులు బనాయించి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు