"నల్లకుబేరులకు ముందే సమాచారం.. సామాన్యులకే కష్టాలు"
పుత్తూరు : సగటు సామాన్యురాలిగా కొత్త నోట్ల కోసం బ్యాంకు వద్ద క్యూ లో నిలుచున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నగదు మార్పిడి కోసం చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లిన ఆమె.. క్యూ లో చాలాసేపు వేచి చూసిన లాభం లేకపోయింది. బ్యాంకు తెరిచిన కొద్దిసేపటికే బ్యాంకులో డబ్బు అయిపోయినట్టు ప్రకటించడంతో.. బ్యాంకు అధికారులను నిలదీశారు రోజా.
డబ్బు కొరతపై ఎమ్మెల్యే రోజా బ్యాంకు మేనేజర్ ను నిలదీయగా.. ఏం సమాధానాలో చెప్పాలో తెలియని మేనేజర్ మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. పాతనోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చని ప్రభుత్వం చెప్పినట్టు.. అందుకు తగ్గట్టుగా చర్యలు ఎందుకు తీసుకోలేదని మేనేజర్ ను ప్రశ్నించారు రోజా.
అనంతరం బ్యాంకు నుంచి బయటకొచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అయిన తానే నగదు కోసం ఇబ్బంది పడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాలిక లేకుండా.. పెద్ద నోట్లను రద్దు చేయడం సామాన్యులకు లేని కష్టాలను తీసుకొచ్చిందన్నారు.
నల్లకుబేరులకు ముందే సమాచారం ఇవ్వడంతో వారంతా సంతోషపడుతున్నారని, కేవలం సామాన్యులే ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పనులన్ని మానుకుని జనమంతా బ్యాంకుల ఎదుట గంటల తరబడి వేచియున్నా.. డబ్బులు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.