చంద్రబాబు,లోకేష్ ల భవిష్యత్ చెప్పిన ఎమ్మెల్యే రోజా
నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా చంద్రబాబు నాయుడుపై అలాగే టీడీపీ నేతలపై మండిపడ్డారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ పరిపాలనపై ప్రశంశలు గుప్పించారు. చంద్రబాబుపై నిప్పుల వర్షం కురిపించారు. శ్రీశైలంలోని శివయ్య అందరినీ చల్లగా చూస్తారని, జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు .
రైతుల అడ్డగింతపై రోజా సీరియస్ ... చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ఇంచు కూడా కదలనివ్వమని వార్నింగ్
చంద్రబాబు జామానాపై విరుచుకుపడిన రోజా
ఇక నాటి టీడీపీ పాలనపై నగరి ఎమ్మెల్యే రోజా విమర్శల వర్షం కురిపించారు. వారికి జైలే గతి అని తేల్చి చెప్పారు. టీడీపీ నేతల బండారం బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్న రోజా చంద్రబాబు జామానాపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు 5 సంవత్సరాల పాలన అవినీతిమయం అని రోజా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు పాలనలో ఎప్పుడు ఏడుపేనని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఆయన దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎలాంటి డోకా లేకుండా చూసుకున్నారని రోజా ఆరోపించారు.
కచ్చితంగా చంద్రబాబుతో సహా నాటి మంత్రులు జైలుకు వెళ్తారని రోజా జోస్యం
చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల పాలు చేశారని, టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలిందని పేర్కొన్న రోజా చేసిన తప్పులకు చంద్రబాబు, లోకేష్, ఆయన కేబినెట్లో పనిచేసిన వారంతా కచ్చితంగా త్వరలోనే జైలుకి వెళ్తారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు . తన మాజీ పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు ఇంటి మీద, ఆయన ఆఫీసుల మీద ఐటీ దాడులు జరిగితే 2 వేల కోట్ల మేర అవినీతి బయట పడింది అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు.
జగన్ పాలనకు కితాబిచ్చిన రోజా
జగన్మోహన్ రెడ్డి 9 నెలల పాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా జగన్ పాలన ఉందని ఆమె కితాబిచ్చారు. దేశం మొత్తం రాష్ట్రంలోని పథకాల వైపు చూస్తున్నారని చెప్పుకున్న రోజా వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఏపీలో అమలు అవుతున్న పథకాలు అమ్మఒడి, 3 రాజధానులు, దిశా యాక్ట్ గురించి తెలుసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.