ఆ దంపతులను ప్రభుత్వమే చంపింది: బాబుపై రోజా తీవ్ర విమర్శలు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రామయ్య దంపతులది ప్రభుత్వ హత్యేనని ఆమె ఆరోపించారు. మంగళవారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే సీఎం చంద్రబాబు అబద్ధాల హామీలు ఇచ్చారని మండిపడ్డారు.
ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని, ఈ హామీ వట్టి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రుణాలు కూడా మాఫీ కాలేదని, ఈ బూటకపు హామీలతో అమాయక ప్రజలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, చంద్రబాబు ఓ కార్మిక ద్రోహి అని రోజా దుయ్యబట్టారు.
తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్ మంచి గుర్తింపు పొందిందని, కార్మికుల పొట్టకొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందని, ఈ గ్యారేజ్ కార్మికులకు వైయస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని రోజా చెప్పారు.
Recommended Video
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపతులు రుణమాఫీ కాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం ఇస్తానన్న రుణమాఫీ కాకపోవడం, తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతితో స్థానికంగా విషాదంగా నెలకొంది.