చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ .. మతరాజకీయలు చేస్తే పతనం తప్పదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహం ధ్వంస ఘటనల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆలయాలలో దాడులు పెరిగాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తుంటే, దేవుడి పేరుతో రాజకీయం చేయడం తప్పని అధికారపక్షం నిప్పులు చెరుగుతోంది.
Recommended Video
ఆ ఆలయాల పునర్నిర్మాణానికి రేపే ముహూర్తం .. ప్రతిపక్షాలకు, ముఖ్యంగా చంద్రబాబుకు జగన్ షాకింగ్ సమాధానం
దేవుడితో రాజకీయం చేస్తే మరింత పతనం తప్పదని హెచ్చరిక
తాజాగా ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. దేవుడితో రాజకీయం చేస్తే చంద్రబాబునాయుడికి మరింత పతనం తప్పదని రోజా హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో విజయవాడలో ఆలయ విధ్వంస కార్యక్రమం కొనసాగిందని గుర్తు చేసిన రోజా చంద్రబాబు ఈరోజు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు అంటూ, మత రాజకీయాలు మొదలు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చి టాయిలెట్లు కట్టారు
గతంలో వేయికాళ్ల మండపం కూల్చారని ఆరోపించిన రోజా, అలిపిరి లో చంద్రబాబుకు దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో అందరికీ తెలుసు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు పతనమై ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు రోజా. చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చి టాయిలెట్లు కట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు,గతంలో ఆయనను సీపీగా పెట్టలేదా అంటూ ప్రశ్నించారు.
ఏపీలో పని చేస్తున్న అధికారులంతా నాడు చంద్రబాబు హయాంలో పని చేసిన వారే
ప్రస్తుతం వైసిపి హయాంలో పనిచేస్తున్న అధికారులందరూ, చంద్రబాబు హయాంలో ఉన్నవారు కాదా అంటూ రోజా నిలదీశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను కొత్తగా తీసుకువచ్చారు అని ప్రశ్నించిన రోజా అయ్యప్ప మాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దేవాలయాల్లో భద్రత కోసం 20వేల సిసి కెమెరాలు పెట్టారని, చంద్రబాబు పాలన సమయంలో ఇలా ఎందుకు చెయ్యలేదు అంటూ ప్రశ్నించారు.
మతరాజకీయాలకు పతనం తప్పదన్న రోజా
చంద్రబాబు చేయని అభివృద్ధి వైయస్ జగన్ చేసి చూపిస్తున్నారని, ఆలయాల అభివృద్ధి విషయంలో కూడా వైయస్ జగన్ ముందున్నారని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఈ విధంగా మత రాజకీయాలు చేస్తే పతనం తప్పదని రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతీ విషయాన్ని రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు తీరు మార్చుకోవాలని హితవు పలికారు .