సీట్ల కోసం సిగపట్లు.. మాట చెల్లుబాటు కోసం ఆధిపత్యం
హైదరాబాద్/ అమరావతి: ఒక పక్క అభివృద్ధి మంత్రంతో నెగ్గుకు రాలేమని ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రకరకాల వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ వివిధ జిల్లాల టీడీపీ నేతలు సిగపట్లకు దిగుతున్నారు. ఎన్నికలకు దాదాపు 18 నెలల ముందే ఫలనా సీటు తన కంటే తనకని కుమ్ములాటలకు దిగారు. కొన్నిచోట్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై స్థానిక ప్రజాప్రతినిధులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
Recommended Video
మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఫిరాయింపు నేతలు ఆశావహులకు ఎసరు పెట్టేలా ఉన్నారు. మరొకవైపు అధికార పార్టీలు తమ మాటే చెల్లుబాటు కావాలని పట్టుబట్టడం ఆ పార్టీ నేతల్లో ఉన్న ఏకపక్ష ధోరణులు, పట్టుదలలను తెలియజేస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.
అరకు, పాడేరుల్లో ఇదీ పరిస్థితి
వెరసి ఎన్నికల వేడి రాజుకోకముందే అధికార టీడీపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. తాను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ప్రజాప్రతినిధులే కాదు.. ఆ పార్టీ నేతలు సైతం గురిపెట్టి బరిలోకి దిగుతుండడంతో సిటింగ్లకు ప్రాణ సంకటంగా మారింది. ఈసారి సీటు దక్కుతుందో లేదోనన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. ఒక్కో సీటుకు సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేతోపాటు నలుగురైదుగురు నేతలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల పుణ్యమాని అరకు, పాడేరు స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్లు సివేరి సోమ, మణికుమారి ఆశలకు గండిపడే పరిస్థితులు నెలకొన్నాయి.
కిడారి రాకతో టీడీపీ సీనియర్ల ఆశలకు గండి
వచ్చే ఎన్నికల్లోనైనా గెలవకపోతానా? అని పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆశలు పెట్టుకోగా.. ఈసారి తనకు చాన్స్ దక్కుతుందన్న ఆశతో సీనియర్ నాయకుడు పాంగి రాజారావు ఇంతకాలం ఉన్నారు. గతేడాది టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రాకతో వీరి ఆశలకు గండిపడ్డట్లైంది. ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని నమ్మించి మోసగించినా పార్టీనే అంటిపెట్టుకున్న మాజీ మంత్రి మణికుమారి, త్రిసభ్య కమిటీ సభ్యులైన బొర్రా నాగరాజు, ఎంవివిఎస్ ప్రసాద్ కూడా వచ్చే ఎన్నికల్లో పాడేరు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు.
పైకి మాత్రమే గుంభనం.. లోలోన ఫిరాయింపుదార్లపై అసంతృప్తి
ఇటీవల కానీ అనూహ్యంగా టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాకతో వీరి ఆశలకు ఇక్కడ గండి పడింది. ఈ రెండు చోట్ల పైకి గుంభనంగా ఉన్నా లోలోన మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై టీడీపీలోని ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి చేరికను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బాహాటంగానే వ్యతిరేకించారు. గత నాలుగేళ్లుగా నామినేటెడ్ పదవులు దక్కక.. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ఆశ లేక ఏజెన్సీ టీడీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది. ఏ క్షణంలోనైనా వీరు తమ అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గంటా, ఆవంతి ముందస్తు ప్రకటనలు ఇలా
దీనికి తోడు మైదాన ప్రాంతంలోని అనకాపల్లితోపాటు యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకు పలువురు ఎసరుపెట్టేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్పై ఒకరు కాదు.. ఇద్దరు కాదు నెలకొకరు సీటు నాదంటే నాదంటూ తెరపైకి వస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూకబ్జా కేసులో ఇరుక్కోవడంతో ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఈ స్థానం నుంచి పోటీ చేయబోతున్నామని గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు నర్మగర్భ ప్రకటనలు చేశారు.
అనకాపల్లి సీటుపై గంటా బంధువు ఇలా ట్విస్ట్
అబ్బే అదేం లేదని, ఈసారి నేనే పోటీ చేస్తా, నా సీటు ఎవరికీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చెప్పారు. తాజాగా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలికి టీడీపీ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావు తన మనసులోని మాటను బయటపెట్టారు. అనకాపల్లి నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని, పార్టీ అధిష్టానం కూడా తన సేవలను గుర్తించి టికెట్ ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్పై ఏకంగా నలుగురు పోటీ పడుతున్నట్టయ్యింది.
కొత్త స్థానంపై పంచకర్ల రమేశ్ బాబు ఫోకస్
యలమంచిలి నుంచి రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ స్థానంపై మరో ఇద్దరు నేతలు కన్నేశారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు ఆడారి ఆనంద్తో పాటు జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని భర్త లాలం భాస్కర్ ఈ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. విశాఖ డెయిరీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఆడారి తులసీరావుతోపాటు ఆయన కుమార్తె పాల్గొనేవారు. కానీ కొన్ని నెలలుగా ఆనంద్ చురుగ్గా పాల్గొంటున్నారు. భాస్కర్ కూడా ఈ అసెంబ్లీ టిక్కెట్పై పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో పంచకర్ల కొత్త నియోజకవర్గం వెతుక్కోవల్సిన పరిస్థితి నెలకొంది.
సీటు మార్పిడికి అవకాశం లేకుంటే చోడవరంపై ఇలా
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఈసారి ఎసరు పెట్టేలా ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజుకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతిసారి అసెంబ్లీ సెగ్మెంట్ మారే గంటా ఈసారి సిటీలో ఏదో సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వర్కవుట్ కాకపోతే గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన చోడవరాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ స్థానం నుంచి టీడీపీ తరపున తాను బరిలోకి దిగబోతున్నట్టు గంటా తనయుడు రవితేజ అప్పట్లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి ఈ తండ్రీ కొడుకులిద్దరూ చోడవరంలో ఎమ్మెల్యే రాజు సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలంరెడ్డి వర్సెస్ సోమిరెడ్డి పాలిటిక్స్ ఇలా
మరోవైపు నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీలో మరో రకం గడబిడ కొనసాగుతున్నది. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిలతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా నీటి పంపకాల కోసం నేతల మధ్య తమ మాట చెల్లుబాటు కోసం రగడ మొదలైంది. ఆధిపత్యం కోసం కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాకులాడుతుంటే.. అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం పేరుతో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మెట్టు దిగనంటున్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ద్వారా ఎమ్మెల్యేతో మధ్యవర్తిత్వంతో తొలుత అంగీకరించినా తర్వాత రైతుల ప్రయోజనాలని ఎమ్మెల్యే పోలంరెడ్డి చివరకు అడ్డం తిరగడం వివాదాస్పదంగా మారింది.
ముందు సరేనన్న పోలంరెడ్డి.. తర్వాత ఇలా రివర్స్
బుచ్చిరెడ్డిపాళెం ఇరిగేషన్ సబ్ డివిజన్ను రెండు సబ్ డివిజన్లుగా విభజిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ విషయమై తొలుత కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంత్రి సోమిరెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. బుచ్చిరెడ్డిపాళెం సబ్ డివిజన్ పరిధిలోని సాగు భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్ డివిజన్ల పునర్విభజన చేయాలని అంతా కలిసి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మంత్రి సోమిరెడ్డి కసరత్తు చేశారు. ఇరిగేషన్ సబ్ డివిజన్ను రెండుగా విభజించారు. అయితే ముందుగా విభజనకు మంత్రి సోమిరెడ్డి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ అంగీకరించారు. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే విభజన సరికాదనడంపై చర్చ మొదలైంది.
ప్రాభవం పెంచుకోవడానికే పోలంరెడ్డి ఇలా హడావుడి
పునర్విభజనకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మొదట అంగీకరించినా.. తర్వాత అడ్డం తిరిగారు. పార్టీలో తన ప్రాభవాన్ని పెంచుకోవడం కోసమే రైతు ప్రయోజనాలంటూ ఎమ్మెల్యే హడావుడి చేస్తున్నారనేది పార్టీలో ఒక వర్గం వాదన. గతంలో ఈ విషయంపై మంత్రి సోమిరెడ్డికి, ఎమ్మెల్యే పోలంరెడ్డికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్యవర్తిత్వం నడిపి సర్దుబాటు చేశారు. పోలంరెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం వెనుక ఆధిపత్యం కూడా వాదన ఉన్నదని వినిపిస్తున్నది. డివిజన్లో పనుల బిల్లులు కూడా కొంత పెండింగ్లో ఉన్నాయి. దీనిని ఎమ్మెల్సీ, మంత్రులు పట్టించుకోక, కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తిరుగుబావుటా ఎగరవేశారు. పెన్నా డెల్టా రైతులకు రావాల్సిన నీరు తెలుగుగంగకు పంపిణీ చేస్తున్నా ఒక్క మాట కూడా అడగలేదు. దీనికితోడు నీరు - చెట్టు పనుల్లో కోవూరు పరిధిలో జరిగినంత అవినీతి మరే నియోజకవర్గంలో జరగలేదు. తరచూ వివాదాలు వస్తున్న ఈ డివిజన్లో అధికారులను ఆయనే వెనకేసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.