చంద్రబాబూ క్షమించాలి: రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయని టీడీపీ ఎమ్మెల్యే లేఖాస్త్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ నుంచి బరిలో ఉండగా, టీడీపీ ఒక్కర్ని పోటీలో నిలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి బరిలో ఉండగా, టీడీపీ తరపున వర్ల రామయ్య పోటీకి దిగారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కలిశా..
ఈ క్రమంలో రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తాను సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నందునే రాజ్యసభ ఎన్నికల ఓటింగ్కు రాలేకపోయానని తెలిపారు. తాను ఇటీవల వ్యాపారరీత్యా జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిసినట్లు తెలిపారు.
ముత్తిరెడ్డికి కరోనా.. క్వారంటైన్లో సత్యప్రసాద్..
అయితే, ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు సత్యప్రసాద్. వైద్యుల సూచనల మేరకే తాను రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. తన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
క్షమించాలి చంద్రబాబూ..
ఈ విషయంలో తనను దయచేసి క్షమించాలని అధినేత చంద్రబాబును కోరారు. టీడీపీ తాను వీరవిధేయుడినని.. రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనకపోవడం తనకు కూడా బాధగానే ఉందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే తనకు ఈ కీలక సమయంలో ఇలా జరగడం బాధగా ఉందన్నారు. పార్టీకి అవసరమైనప్పుడు ఎల్లవేళలా ముందుంటానని, చంద్రబాబు ఆశీస్సులు, భగవంతుని దయ తనకు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Recommended Video
అచ్చెన్నా దూరమే.. ఆ ఎమ్మెల్యేలు అధికార పార్టీవైపేనా..?
ఇది ఇలావుండగా, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా ఏసీబీ అరెస్టు, అస్వస్థతతో ఓటింగ్కు రాలేకపోయారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్లు అధికార పార్టీకే ఓటు వేసినట్లు సమాచారం. గురువారం జరిగిన వైసీపీ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు కూడా వీరు హాజరుకావడం గమనార్హం. మరో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఓటు ఎవరికనేది సందిగ్ధంలోనే ఉంది. జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకే ఓటు వేసినట్లు తెలిసింది. అయితే, ఫలితాలే తర్వాతే అసలు విషయం తేలనుంది.