ఎమ్మెల్యేకు చిక్కులు తెచ్చి పెట్టిన పవన్ కల్యాణ్: సహకరించలేదని మొర
పవన్ కల్యాణ్ ఉద్ధానం పర్యటన ఎలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబును చిక్కుల్లో పడేసింది. పవన్ కల్యాణ్కు ఆయన సహకరించినట్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.
విశాఖపట్నం: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉద్దానం పర్యటన ఎలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబును చిక్కుల్లో పడేసింది. పవన్ కల్యాణ్ పర్యటనకు సహకరించినట్లు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. పవన్కల్యాణ్కు శ్రీకాకుళం పర్యటనలో తాను సహకరించలేదని రమేష్ బాబు స్పష్టం చేశారు.
ఏ విధంగానైనా తాను సాయపడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పవన్కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయనకు విశాఖ నుంచి తానే వాహనం (ఎండీవర్ కారు) ఏర్పాటు చేసినట్టు పార్టీకి ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు.
ఎండీవర్ కారు తమ కుటుంబంలో ఎవరికీ లేదని స్పష్టంచేశారు. పంచకర్ల అంటే తానొక్కిడినే కానని, విశాఖలో అదే ఇంటిపేరుతో చాలా మంది ఉన్నారన్నారు. పంచకర్ల శ్రీనివాస్ అనే బిల్డర్ కుమారుడు పంచకర్ల సందీప్ గీతం వర్సిటీలో చదువుతున్నాడని, అతడో విద్యార్థి సంఘ నాయకుడని, అతనే పవన్కల్యాణ్కు ఏర్పాట్లు చేశారని వివరించారు.
ఉద్ధానం కిడ్నీ బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించి, వారితో మాట్లాడడం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో పంచకర్ల రమేష్ బాబుపై రాజకీయ ప్రత్యర్థులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.