ఎమ్మెల్యే శ్రీదేవికి కులపరీక్ష..జేసీ ఎదుట హాజరు: కావాలనే ఇదంతా అని ఆగ్రహం
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల వివాదానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఎమ్మెల్యే శ్రీదేవి సామాజిక తరగతి పై జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో విచారణ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ కు అందిన ఫిర్యాదు మేరకు ఈసీ ఆదేశాలతో ఉండవల్లి శ్రీదేవి ఏ కులానికి చెందినవారు అన్న వివాదంపై ఆమె గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ఎదుట తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు శ్రీదేవి కుటుంబ సభ్యులను మాత్రమే లోనికి అనుమతించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.
కుల వివాదంలో శ్రీదేవి... జేసీ చాంబర్ లో విచారణ
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే సామాజికవర్గ వివాదం ఇప్పుడు ఆమెను విచారణ కు హాజరయ్యేలా చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీదేవి కుల పరీక్షను ఎదుర్కొంటోంది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం శ్రీదేవి పై జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పతి భవన్ అధికార వర్గాలు అప్పటి సీఎస్ కు లేఖ రాసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
తాను ఎస్సీ అని నిరూపించుకునే పనిలో ఎమ్మెల్యే శ్రీదేవి
ఇక ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నుండి వచ్చిన లేఖ ఆధారంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నేడు ఎమ్మెల్యే విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. దీంతో ఆమె తాను ఎస్సీ అని నిరూపించుకునే క్రమంలో అందుకు కావాల్సిన ఆధారాలను, బంధువులను వెంట తీసుకొని విచారణకు హాజరయ్యారు శ్రీదేవి. గతంలో ఎమ్మెల్యే శ్రీదేవిని వినాయక చవితి పండుగ సందర్భంగా ఆమె వినాయకుడికి పూజ చేస్తే దేవుడు కూడా మైల పడతారని వ్యాఖ్యలు చేయడంతో ఆమె కుల వివక్షను ఎదుర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
గతంలో కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీదేవి .. ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం
ఇక ఈ విషయంపై మాట్లాడిన ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరకాటంలో పడేశాయి. తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్తుడు అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆమెకు కుల పరీక్షను తెచ్చిపెట్టాయి. ఆమె ఎస్సీ ఎలా అవుతారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆమె చేసిన వ్యాఖ్యలనే ఆధారంగా తీసుకొని ఫిర్యాదు చేసింది. ఇక ఈ నేపథ్యంలో కుల పరీక్షను ఎదుర్కొంటున్న శ్రీదేవి జాయింట్ కలెక్టర్ వద్ద విచారణకు హాజరై కావాలని కొందరు నేతలు తనపై కక్షపూరితంగా ఇలా ఫిర్యాదులు చేస్తున్నారని, తాను పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.
నేడు విచారణకు హాజరు.. కుల ద్రువీకరణ పత్రాలు జేసీకి ఇచ్చిన ఎమ్మెల్యే
ఇక తన సామాజిక వర్గానికి సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాన్ని జెసి దినేష్ కుమార్ కు అందించానని తెలిపారు. తనకూ,తన కుటుంబ సభ్యులకు హిందూ మాదిగ కుల ధ్రువపత్రాలు ఉన్నాయన్నారు. ఇక అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా తాను హాజరవుతానని చెప్పారు. అంతేకాదు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీదేవి.
కావాలనే టార్గెట్ చేస్తున్నారని శ్రీదేవి ఆగ్రహం
ఏపీ రాజధాని అమరావతి లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నందుకే ప్రతిపక్ష పార్టీల నేతలు తనను టార్గెట్ చేసి,ఆరోపణలు చేస్తున్నారని శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవికి వినాయక చవితి సందర్భంగా మొదలైన కుల పంచాయితీ అనేక ఎపిసోడ్ లు గా ఇంకా కొనసాగుతుంది . ఇక నేడు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి కుల పరీక్షలో నెగ్గుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.