ఏపీ సీఎం-ఎల్వీ సుబ్రహ్మణ్యం! మధ్యలో శ్రీదేవి.. సీఎస్ ఆకస్మిక బదిలీకి అసలు కారణం అదేనా!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎస్ బదిలీ వెనుక చోటుచేసుకున్న కీలక ఉదంతాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై ఆసక్తికర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. సీఎస్ బదిలీ వెనక ఉన్న పరిణామాలపై ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో నెలకొన్న అభిప్రాయ భేదాలు కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీకి కారణమయ్యాయన్న వాదనలు వినిపిస్తుండగా, మరో కారణం అమరావతి కేంద్రంగా తాజాగా ప్రచారంలోకి వస్తోంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వెనక కారణం అదేనా..
ఏపీ ఛీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీకీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన ఉండవల్లి నుంచి ఆమె ఘన విజయం సాధించడంతో ఆమె అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా ఏ క్షణాన ఆమె గెలుపొందారోగాని వివాదాలు తారా స్ధాయిలో చుట్టుముడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా టీడీపీ వర్గానికి, ఎమ్మెల్యే శ్రీదేవికి మధ్య వివాదం చోటుచేసుకుంది.
ముదిరిన ఉండవల్లి శ్రీదేవి వివాదం..
తాడికొండ నియోజకవర్గంలోని అనంతవరంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి వచ్చిన ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ కార్యకర్తలు నిలువరించారు. తుళ్లూరు మండలంలో జరిగిన విరాయక మండపంలో కూడా ఇదే సీన్ పునారావృతమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నేరుగా వినాయక మంటపానికి వచ్చిన ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకొని వెనక్కి పంపించారు. తాను షెడ్యూలు కులానికి చెందిన దానిని కాబట్టే వినాయక మండపానికి రానివ్వలేదని అప్పట్లో ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. అంతే కాకుండా తుళ్లూరు పోలీసులకు నలుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేయడమే కాకుండా జాతీయ ఎస్సీ కమిషన్కూ ఆమె కంప్లయింట్ చేశారు ఉండవల్లి శ్రీదేవి.
ఇంతకీ ఆమె ఎవరు...
అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ డీజీపీలకు ఇదే అంశం పట్ల విజ్ఞప్తులు కూడా చేసుకున్నారు. దీంతో శ్రీదేవికి వ్యతిరేకంగా టీడీపీ నాయకత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. శ్రీదేవి హిందువు కాదని, క్రిస్టియన్ అని ఆధారాలతో సహా ఫిర్యాదు సమర్పించింది. దాంతో ఈ వివాదంలో వాస్తవ వివరాలు తమకు వివరించాలని కోరుతూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి కొద్ది రోజుల కిందట నోటీసులు కూడా అందాయి. రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటీసు రావడంతో ఇదే వ్యవహారంపై నివేదిక ఇవ్వడానికి సీఎస్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.
నివేదిక అంశంలో సీఎం మాట వినని సీఎస్..
సరిగ్గా ఇదే సమయంలో శ్రీదేవి క్రిస్టియన్ కాదని, హిందువేనని నిర్ధారించే నివేదిక సిద్దంచేసి రాష్ట్రపతి కార్యాలయానికి పంపించాల్సిందిగా సీఎం జగన్ కార్యాలయం సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రపతి కార్యాలయానికి పంపే నివేదిక కాబట్టి, వాస్తవాలను తారుమారు చేయలేమని సీఎస్ భావించినట్టు తెలుస్తోంది. జరిగిన సంఘటన పట్ల వాస్తవ నివేదిక పంపించాల్సిన బాధ్యత తనపై ఉందని, సీఎం చెప్పినట్లు చేయలేనని సుబ్రహ్మణ్యం కరా ఖండిగా చెప్పడంతో సీఎం ఇగో దెబ్బతిన్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే సీఎస్ పై ఆకస్మిక బదిలీ వేటు వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎస్ హోదాలో సుబ్రహ్మణ్యం వాస్తవ వివరాలు రాష్ట్రపతి కార్యాలయానికి పంపితే ఉండవల్లి శ్రీదేవి దళితురాలు కాదని తేలుతుందని, అలా నిర్దారణ ఐతే ఆమె ఎమ్మెల్యే పదవికి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందనే ఆందోళన కూడా వైసీపీ వ్యక్తం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.