ఎమ్మెల్యే టికెట్ నాదే...ఇద్దరు నేతలదీ అదేమాట:వైసిపి అధినేత జగన్ కు పాణ్యం తలపోటు
కర్నూలు:కర్నూలు ఎమ్మెల్యే టికెట్ టిడిపిలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తే...అదే జిల్లాలోని పాణ్యం అసెంబ్లీ నియోజక వర్గం సీటు వైసిపిలో చిచ్చుపెడుతోంది. పాణ్యం ఎమ్మెల్యే టికెట్ నాదంటే నాదని వైసిపి లో ఇద్దరు నేతలు ఇప్పట్నుంచే పంతానికి పోతుండటం ఆ పార్టీ అధినేతకు సమస్యాత్మకంగా మారింది.
పార్టీ అధినేత జగన్ పాణ్యం టికెట్ పై హామీ ఇవ్వడంతోనే వైసీపీలో చేరానని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్రెడ్డి స్పష్టం చేయగా పాణ్యం వైసీపీ నియోజకవర్గం టికెట్ తమదేనని ఎమ్మెల్యే గౌరుచరిత తేల్చి చెబుతున్నారు. దీంతో ఎన్నికల వేడి ఇంకా మొదలుకాకముందే ఇప్పట్నుంచే టికెట్ గురించి ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతుండటం చివరకు ఎటు దారితీస్తుందోనని స్థానిక వైసిపి నేతలు మథనపడుతున్నారు.
కాటసాని...స్పష్టం చేసేశారు
శనివారం నంద్యాల చెక్పోస్టు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో సుభాకర్రెడ్డి అధ్యక్షతన చేపట్టిన వైసిపి క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీ సీటు కోసమో, ఇతర నియోజకవర్గాల వైపో చూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, కార్యకర్తలు అలాంటి ప్రచారాలు,అపోహలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
పాణ్యం వీడనని...తేల్చేశారు
తనకు ఎమ్మెల్యే టికెట్ విషయమై పార్టీ అధినేత స్పష్టం గా హామీ ఇచ్చారని...ఆ హామీ ప్రకారమే తాను పార్టీలో చేరానని కూడా ఇటీవలే వైసిపిలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తేల్చేశారు. తాను ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారం లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పాణ్యం వీడే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు.
మరోవైపు...సిట్టింగ్ ఎమ్మెల్యే
అయితే వచ్చే ఎన్నికల్లో పాణ్యం ఎమ్మెల్యే టికెట్ తనకేనని సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత స్పష్టం చేశారు. శనివారం కల్లూరు సాయిశ్రీనివాస గార్డెన్లో రాష్ట్ర మైనార్టీసెల్ కార్యదర్శి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించిన పాణ్యం నియోజకవర్గ క్షేత్ర స్థాయి కన్వీనర్ల సమావేశానికి ఎమ్మెల్యే గౌరుచరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పాణ్యం టికెట్ మాదే: గౌరు చరిత
పాణ్యం వైసీపీ నియోజకవర్గం టికెట్ తమదేనని ఎమ్మెల్యే గౌరుచరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గ క్షేత్ర స్థాయి కన్వీనర్ల సమావేశంలో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గౌరు దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీకి సేవచేస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తమకే టికెట్ వస్తుందని, అందులో ఎలాంటి సందేహాలు వద్దని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకుడు, పాణ్యం టికెట్ తమదేనంటూ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. దీంతో వైసిపిలో పాణ్యం ముసలం తప్పదని స్థానిక పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.