బాబుకు 'రివర్స్' తలనొప్పి: టిడిపిలోకి ఓడిన వ్యక్తి, ఎమ్మెల్యే అసంతృప్తి
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేరికల చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల టిడిపి ఇంఛార్జులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. వైసిపి నేత గండి బాబ్జీ గురువారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈయన చేరిక పైన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసంతృప్తితో ఉన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేశారు. వైసిపి తరఫున గండి బాబ్జీ పోటీ చేశారు. గండి బాబ్జి పైన బండారు గెలుపొందారు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేల చేరిక పైన టిడిపి ఇంఛార్జులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. వైసిపి నేత బాబ్జి చేరిక పైన ఏకంగా ఎమ్మెల్యే అసంతృప్తికి గురయ్యారు. గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యక్రమానికి బండారు డుమ్మా కొట్టారు. బండానే కాకుండా మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంపీ అవంతి, ఎమ్మెల్యేలు అనిత, గణబాబు, షీలా గోవింద్, రమేష్ బాబులు కూడా బాబ్జీ రాకను వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.
కాగా, గొట్టిపాటి రవి కుమార్ చేరికను అద్దంకి టిడిపి నేత కరణం బలరాం, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరికపై రామసుబ్బా రెడ్డి,క భూమా చేరికపై శిల్పా సోదరులు.. ఇలా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.