కమ్మ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు - ఏపీలో లేడు, ట్యాపింగ్ ఏంటి? - వల్లభనేని వంశీ -బచ్చుల కౌంటర్
ఆంధ్రప్రదేశ్ లో కుల విభేదాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న వేళ టీడీపీ బహిష్కృత నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో రమేశ్ ఆస్పత్రి యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలకు దిగిన వ్యవహారంలో కులాల ప్రస్తావన వినిపించడం, కరోనా కంటే కులం చాలా డేంజరన్న సినీ నటుడు రామ్ పోతినేనికి టీడీపీ అధినేత చంద్రబాబు సమర్థించడం, ఫోన్ ట్యాపింగ్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో వంశీ కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆయన వల్లే కులానికి సమస్యలు..
ఆంధ్రదేశ్ లో జరుగుతోన్న ప్రతి చిన్న విషయానికి కులాన్ని ముడి పెడుతూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని, ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్మ సామాజికవర్గాన్ని ఆయన భ్రష్టు పట్టిస్తున్నాడని, అన్నిటికి కులం రంగులు పులమడం సామాజికవర్గానికి తీరని నష్టం, సమస్యలు ఎదురవుతున్నాయని వల్లభనేని వంశీ అన్నారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
రమేశ్ బాబకు సపోర్టా?
‘‘10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో రమేశ్ ఆస్పత్రిపై చర్యలకు దిగడం ప్రభుత్వం విధి. అయినా, రమేష్ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా సేవలు చేస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ కింద బిల్లులు తీసుకుంటున్నారు కదా?దర్యాప్తు చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుంది? అసలు ఏ తప్పూ చేయకుంటే రమేశ్ బాబు ఎందుకు పారిపోయినట్లు? తెలంగాణలో కోవిడ్ ఆస్పత్రులపై కేసీఆర్ చర్యలు తీసుకున్నప్పుడు జాతీయ పార్టీ నేతలుగా చంద్రబాబు, లోకేశ్ స్పందించారా? విశాఖ ఎల్జీ పాలిమర్ ప్రమాదంపై చర్యలు కోరుతూ లేఖలు రాసిన ఆ ఇద్దరూ ఇప్పుడు రమేశ్ బాబును సమర్థించడంలో అర్థముందా?'' అని వంశీ నిలదీశారు.
షాకింగ్: ఆ నీటిలో కరోనా వైరస్ - హైదరాబాద్లో 6.6 లక్షల కేసులు - సీసీఎంబీ పరిశోధనలో సంచలనాలు
బాబుకు మానసిక భ్రాంతి..
కరోనా వైరస్ వచ్చిన తర్వాత అతి కష్టంగా నాలుగు రోజులు తప్ప అసలు ఏపీలోనే లేకుండా పోయిన చంద్రబాబు ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందనడం హాస్యాస్పదంగా ఉందని వల్లభనేని అన్నారు. రాష్ట్రంలో పనిలేని వ్యక్తి ఫోన్ ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. ‘‘ఏపీని వదిలిపోయిన తర్వాత హైదరాబాద్ లోని ఇంట్లో ఒక గదికి మాత్రమే పరిమితమైపోయి, జూమ్ లో మాట్లాడుతోన్న చంద్రబాబు మానసిక భ్రాంతితో తన ఫోన్ ట్యాప్ అయిందంటున్నారు'' అని వంశీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే,
వంశీకి జగన్ బిస్కెట్లు..
చంద్రబాబును, డాక్టర్ రమేశ్ బాబును ఉద్దేశించి వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ తప్పుపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మీడియాముఖంగా కౌంటర్ ఇచ్చారు. ‘‘వంశీ.. నోటిని అదుపులో పెట్టుకొ. జగన్ వేసే బిస్కెట్లకు ఆశపడి ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు. స్వర్ణ ప్యాలెస్ ఘటనతో రమేశ్ ఆస్పత్రికి సంబంధమే లేదు. అనుమతి తర్వాతే అక్కడ కొవిడ్ సెంటర్ పెట్టారు. అక్కడ తనిఖీలు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏపీలో వైద్యశాఖ నిద్రపోతోందా? ముందూ వెనుకా చూసుకోకుండా వల్లభనేని వంశీ తాడేపల్లి స్క్రిప్ట్ చదివేస్తున్నాడు'' అని అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.