కీలక సమయంలో సభలో లేని వైసీపీ ఎమ్మెల్యేలు: ఏమయ్యారంటూ సీఎం జగన్ సీరియస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానానికి అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. శాసనసభలోని సభ్యులంతా మండలి రద్దు తీర్మానానికి మద్దతు పలికారు. అయితే, కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం
133 మంది ఎమ్మెల్యేల మద్దతు.. టీడీపీ ఎమ్మెల్యేలు దూరం
అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంకు స్పీకర్ తమ్మినేని సీతారం ఓటింగ్ నిర్వహించిన సమయంలో సభలో 133 మంది ఎమ్మెల్యేలున్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. వీరంతా మండలి రద్దు తీర్మానానికి మద్దతు తెలిపారు.ఇక టీడీపీ సభ్యులు మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు ఓటింగ్కు ముందుగానే సభ నుంచి వెళ్లిపోయారు.
సభలోలేని 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు
అయితే, జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాసనమండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం గమనార్హం. అయితే, ఓటింగ్ సమాచారం అందకపోవడం వల్లే ఆ ఎమ్మెల్యేలు సభలోకి రాలేదని వైసీపీ చెబుతోంది.
సీఎం జగన్ సీరియస్..
కాగా, ఓటింగ్ సమయంలో అసెంబ్లీలో లేని వైసీపీ ఎమ్మెల్యేలపై సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సభలో ముఖ్యమైన తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో సభలో ఉండకుండా ఏం చేస్తున్నారని మండిపడినట్లు తెలిసింది.
ఓటింగ్ సమయంలో సభ డోరు వేయడంతో నలుగురు ఎమ్మెల్యేలు బయటే ఉండిపోయారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, పార్థసారథి, దాడిశెట్టిరాజాలు ఓటింగ్కూ దూరంగా ఉన్నారు. సభకు గైర్హాజరైన సభ్యులపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసినట్లు సమాచారం. కీలక సమయంలో సభలో లేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది.
మండలి రద్దుకు ఆమోదం.. ఇక కేంద్రానికి..
ది ఇలావుండగా, సోమవారం అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలో సభ్యులు కానీ.. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లను ఓటింగ్కు దూరంగా ఉండాలని స్పీకర్ సూచించారు. ఆ తర్వాత తీర్మానానికి మద్దతిచ్చేవారు వారి వారి స్థానాల్లో నిల్చుకోవాలని కోరారు. దీంతో సభ్యులంతా నిల్చున్నారు. మండలి రద్దు తీర్మానానికి 133 మంది సభ్యులు మద్దతు పలికారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. జనసేన నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మండలి రద్దు తీర్మానానికి మద్దతు తెలిపారు. దీంతో శాసనమండలి రద్దు తీర్మానంకు శాసనసభ ఆమోదం తెలిపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఆ తర్వాత సభను నిరవధిక వాయిదా వేశారు. కాగా, మండలి రద్దు తీర్మానంను కేంద్రానికి పంపించడం జరుగుతుంది. పార్లమెంటు ఆమోదం అనంతరం ప్రక్రియ పూర్తవుతుంది.