ఆయన నియోజకవర్గంలో సీమంతం, షష్ఠిపూర్తి ఉత్సవాలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ
అమరావతి: ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఓ శాసన సభ్యుడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం తనకు టికెట్ ఇస్తుందో? లేదో? అనే అనుమానం కొద్దిరోజులుగా ఆయనన వెంటాడుతోంది. తన నియోజకవర్గంలో.. తనతో పాటు పార్టీలో క్రియాశీలకంగా ఉండే మరో నాయకుడికి టికెట్ ఇస్తారేమో అనే అనుమానం ఆయనది. ప్రజల్లో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఆదరణ తగ్గిపోయిందనుకున్న పార్టీ అగ్ర నాయకత్వం మరొకరిని ప్రోత్సహిస్తుండటమే ఆయన సందేహానికి ప్రధాన కారణం.
మళ్లీ ఎన్నికల్లో నిల్చోవాలి, టికెట్ సాధించాలి అని భావించిన సదరు సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. మహిళలు, వయోధిక వృద్ధులను ఆకర్షించింతే చాలని అనుకున్నట్టున్న ఆయన.. కొద్దిరోజులుగా తన నియోజకవర్గం పరిధిలో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శుభ కార్యాలను చేపడితే.. గంప గుత్తగా ఓట్లన్నీ తనకే పడతాయనీ ఆశించారు. దీనికోసం ఆయన గర్భిణులకు సీమాంతాలు, వృద్ధులకు షష్ఠిపూర్తి కార్యక్రమాలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు.
అసలే ఆయన ఎమ్మెల్యే. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నుంచి గర్భిణుల వివరాలను రాబట్టుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టిన ఆ ఎమ్మెల్యే.. అక్కడి నుంచి గర్భిణుల పూర్తి వివరాలను తెప్పించుకుంటారు. ప్రత్యేకించి ఫోన్ నంబర్. ఆయా గర్భిణుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి నుంచి ఫోన్ కాల్ వెళ్తుంది. సీమంతం నిర్వహిస్తే.. దానికి అయ్యే ఖర్చును ఎమ్మెల్యే భరిస్తారనే సమాచారం వారికి చేరుతుంది.
తాము అందుకు సిద్ధమేనని సంబంధిత గర్భిణి కుటుంబీకులు బదులిస్తే.. దీనికైన ఖర్చు మొత్తాన్ని ఎమ్మెల్యే స్వయంగా వారి ఇంటికి వచ్చి, ఇచ్చి వెళ్తారు. షష్ఠిపూర్తి వ్యవహారంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఎప్పుడు జనాన్ని పెద్దగా పట్టించుకోని ఎమ్మెల్యే.. ఈ సారి ఇలా సీమంతాలు, బారసాలలు, షష్ఠిపూర్తి కార్యక్రమాలకు డబ్బులను పంచడాన్ని వింతగా చెప్పుకొంటున్నారు నియోజకవర్గం జనం. దీనికి కారణం- ఈ సారి తనకు టికెట్ వస్తుందో? రాదో? అనే భయమేనని చెబుతున్నారు. తనకు పార్టీ నాయకత్వం టికెట్ ఇవ్వకపోతే.. నియోజకవర్గం ప్రజలు తన చుట్టూ నిల్చుని, అండగా ఉంటారని ఆ ఎమ్మెల్యే ధీమా.
ఇది ఆ ఒక్క ఎమ్మెల్యే ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రమే కాదు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే ప్రస్తుతం కనిపిస్తోంది. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. జనాన్ని ఆకర్షించడానికి చేసే ప్రతి పనీ నిబంధనను ఉల్లంఘించినట్టు అవుతుంది. అందుకే- వారు కోడ్ రాకముందే అప్రమత్తమౌతున్నారు. దీనికితోడు- తనకు నియోజకవర్గం ప్రజల ఆదరణ ఉందని కూడా నిరూపించుకోవడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయనే అభిప్రాయం ఎమ్మెల్యేల్లో ఉంది.
పలువురు ఎమ్మెల్యేలు.. ఇలా సీమంతాలు, షష్ఠిపూర్తి కార్యక్రమాలు చేయట్లేదు గానీ.. మెజారిటీ సిట్టింగులు చీరె, సారెల పంపిణీ మీద దృష్టి పెట్టారు. ఇది ఖర్చు తక్కువతో కూడుకున్న పని కావడం వల్ల చీరెల పంపిణీ మీదే ఫోకస్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అన్నా క్యాంటీన్లను కూడా తమ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లలో ఒకరోజు భోజనానికి అయ్యే ఖర్చును సొంతంగా భరిస్తున్నారని సమాచారం. ఫలానా రోజు, ఫలానా ఎమ్మెల్యే ఖర్చును భరిస్తున్నట్లు అన్నా క్యాంటీన్ల ముందు ఓ బోర్డు ఉంచి, వారి పేరును రాస్తున్నారు. ఒకరోజు అయ్యే ఖర్చును కూడా ఆ బోర్డులో పొందుపరుస్తున్నారు.
గుంటూరు, అనంతపురం, కడప వంటి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యులు, ఆశావహులు సొంత ఖర్చులతో రాజన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కడప జిల్లా రైల్వే కోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇదివరకే రాజన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. మంగళగిరిలో రాజన్న క్యాంటీన్ నాలుగు రూపాయలకు భోజనాన్ని అందిస్తుండగా.. రైల్వే కోడూరు, రాయచోటిల్లో ఏర్పాటైనవి ఒక రూపాయిని మాత్రమే వసూలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జి నవీన్ నిశ్చల్ కూడా నాలుగు రూపాయలకు భోజనం అందించేలా రాజన్న క్యాంటీన్ ను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవడమే వారి లక్ష్యం.