కడప షాక్కు కారణాలెన్నో: అలా ముందే జగన్ లీక్, చంద్రబాబు పైఎత్తు
కడపలో గెలుస్తామన్న ధీమానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందా? అంటే అవుననే అంటున్నారు. కడపలో వైసిపి ఓటమిపై ఎన్నో రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.
కడప/అమరావతి: కడపలో గెలుస్తామన్న ధీమానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందా? అంటే అవుననే అంటున్నారు. కడపలో వైసిపి ఓటమిపై ఎన్నో రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.
వైయస్ వివేకానంద రెడ్డి ఓటమిని జగన్ ముందే గుర్తించారని భావిస్తూనే... మొదటి నుంచి గెలుపు ధీమా, క్రాస్ ఓటింగ్పై నమ్మకం పెట్టుకోవడంతోనే వైసిపి ఓటమి చెందవలసి వచ్చిందా.. అంటే అవుననే అంటున్నారు.
కడపలో దారుణమైన పాలిటిక్స్: బాబాయ్ గెలుపుపై జగన్కు అనుమానమా?
కడపలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా తిరుగులేదు. వైయస్ మృతి అనంతరం జగన్ పార్టీ పెట్టారు. అప్పుడు వైసిపిని ఆదరించారు. ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించారు.
లైట్గా తీసుకున్నారా?
ఎంపీగా వైయస్ జగన్, గతంలో ఉప ఎన్నికల్లో జరిగిన పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో విజయమ్మ రికార్డు విజయంతో... సొంత ఇలాకాలో తమకు తిరుగులేదని నిరూపించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రివర్స్ అయింది.
టిడిపి అధికారంలోకి వచ్చాక.. ఏపీలో పలువురు నేతలు, ఎమ్మెల్యేలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోను పలువురు సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యే స్థాయి నేతల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా టిడిపిలో చేరారు. ఇలాకాలో తమకు తిరుగులేదని భావించిన జగన్ టిడిపిలో చేరడాన్ని లైట్గా తీసుకున్నారని అంటున్నారు.
క్రాస్ ఓటింగ్
కడప జిల్లా నుంచి కూడా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత కొందరు ఎన్నికలకు ముందు తిరిగి వైసిపిలోకి వచ్చారు. ఎవరిని ఎవరూ లోబర్చుకోకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా టిడిపి, వైసిపిలు క్యాంపు రాజకీయాలు చేశాయి. అదే సమయంలో.. టిడిపిలో చేరిన తమ వాళ్లు క్రాస్ ఓటింగ్తో తమను గట్టెక్కిస్తారని వైసిపి భావించింది. కానీ అలా జరగలేదని అంటున్నారు. క్రాస్ ఓటింగ్పై నమ్మకం పెట్టుకోవడం కూడా జగన్ను దెబ్బతీసిందని అంటున్నారు.
వైసిపి చెప్పడంతో...
కడప జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో 445కు పైగా ఓటర్లు తమ శిబిరంలో ఉన్నారని టిడిపి ముందే చెప్పింది. అంటే జగన్ వైపు కేవలం 390కి మందికి పైగా మాత్రమే ఉన్నారు. టిడిపి శిబిరంలోని వారు కొందరు క్రాస్ ఓటింగ్ చేస్తారని, తమ గెలుపు ఖాయమని వైసిపి ప్రకటించింది.
జగన్ క్రాస్ను అడ్డుకునేందుకు టిడిపి పైఎత్తు
వైసిపి క్రాస్ ఓటింగ్ అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంది. క్రాస్ ఓటింగ్ కట్టడి చేసేందుకు పోలింగ్ సమయంలో కోడ్ విధానం పెట్టింది. దీంతో సభ్యులు క్రాస్ ఓటింగ్కు పాల్పడేందుకు జంకినట్లుగా తలుస్తోంది. క్రాస్ ఓటింగ్ చేస్తారని వైసిపి చెప్పగా, దానిని అడ్డుకునేందుకు టిడిపి పైఎత్తు వేసింది. ఇందులో టిడిపి సక్సెస్ అయింది.