సోనియా ఇంటి ముందు జగన్ దీక్ష చేయాలి: గాలి, ఆ అర్హత జగన్కు లేదన్న మంత్రి
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ చేసిన తప్పులే ఏపీకి శాపాలుగా మారాయని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి అప్పులు, తెలంగాణకు ఆస్తులు వచ్చేలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని పేర్కొన్నారు.
విభజన తర్వాత ఏపీ రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్తో మొదలైందన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ను సైతం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ పడుతున్న కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ధ్వజమెత్తారు.
విభజన సమయంలో చంద్రబాబు అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పుడు చంద్రబాబును కాంగ్రెస్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రత్యేకహోదాను విభజన చట్టంలో పెట్టలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియమించిన రఘురాజన్, వైవీరెడ్డి కమిటీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పాయని అన్నారు.
త్వరలో వైయస్ జగన్ ఢిల్లీలో తలపెట్టిన దీక్షపై కూడా గాలి మండిపడ్డారు. వైయస్ జగన్ తన దీక్షను సోనియా గాంధీ ఇంటిముందు పెట్టుకోవాలని గాలి సూచించారు. జగన్ అవినీతిలో కేవీపీ రామచంద్రరావు పాత్ర కూడా ఉందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు.
ప్రత్యేక హోదాపై మంత్రి మాణిక్యాలరావు
ప్రత్యేక హోదాపై మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు కావాలనే అవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేకహోదా కంటే ఎక్కువగానే కేంద్రం ఏపీకి నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రత్యేకహోదాపై జగన్కు దీక్ష చేసే అర్హత లేదన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని ప్రత్యేక హోదాపై ఆందోళన చేస్తుందో అర్థం కావడంలేదని అన్నారు.
పర్యాటక ప్రాంతంగా కృష్ణదేవిపేట: అయ్యన్నపాత్రుడు
క్విట్ ఇండియా డే సందర్భంగా గొలిగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు ఘాట్ వద్ద మంత్రి అయ్యన్న నివాళులర్పించారు. అనంతరం శనివారం మీడియాతో మాట్లాడుతూ త్వరలో లంబసింగిలో రూ.5 కోట్లతో టూరిజం కాటేజీల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు.
కృష్ణదేవిపేటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. తాజంగిలో 37 ఎకరాలలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆగస్టు 15 నాటికి పట్టిసీమ నుంచి నీటిని విడుదల: కొల్లు రవీంద్ర
ఆగస్టు 15 నాటికి పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కొల్లురవీంద్ర వివరించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారం సింగమలలో బీసీ వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ హాస్టళ్లను రెసిడెన్సియల్ హాస్టళ్లుగా మారుస్తామని తెలిపారు.
ఫీ రీయింబర్స్మెంట్లో భాగంగా రూ. 1600 కోట్లు విడుదల చేశామన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.