బీజేపీ ఏపీ పగ్గాలు మాధవ్ చేతికి? ఉత్తరాంధ్ర.. బీసీ కార్డు.. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిసొస్తాయా?
అమరావతి: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్కు అప్పగించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం త్వరలోనే ముగియబోతోంది. ఆయన స్థానంలో పార్టీ అధిష్టానం మాధవ్ను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ.. నాయకత్వ మార్పిడి వైపే మొగ్గు చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
బీజేపీ అధ్యక్ష రేసులో సీనియర్ల ఉన్నప్పటికీ..
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష కోసం ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువే. గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రకాశం జిల్లా నుంచి కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, రాయలసీమ నుంచి సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు బీజేపీ అధ్యక్ష స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. వారిలో విష్ణువర్ధన్ రెడ్డి జూనియర్. రాయలసీమకు చెందిన వ్యక్తి కావడం ఒక్కటే ఆయనకు కలిసి వచ్చే అంశం. ఆ ఒక్క కారణంతో సోమగుంట పేరును బీజేపీ అధిష్ఠానం అసలు పరిశీలనలోకి తీసుకోలేదని అంటున్నారు.
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ..
సోము వీర్రాజుకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. వివిధ అంశాలపై అవగాహన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై పదునైన విమర్శలను సంధించే సామర్థ్యం ఉంది. అంశాలవారీగా విమర్శకుల నోళ్లను మూయించగలరనే పేరు సోము వీర్రాజుకు ఉంది. అవేవీ- ప్రస్తుతం అక్కరకు రాలేకపోవచ్చని అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడమే మైనస్ పాయింట్గా మారొచ్చని చెబుతున్నారు.
వరుసగా రెండోసారి కాపు కులానికే అవకాశం ఇవ్వడం సరికాదనే..
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. పార్టీ సీనియర్ నాయకుడు, అధ్యక్ష పదవి రేసలో ముందంజలో ఉన్న సోము వీర్రాజు అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. వరుసగా రెండోసారి కాపు సామాజిక వర్గానికే అధ్యక్ష పదవిని అప్పగించడం వల్ల వెనుకబడిన వర్గాలకు చెందిన నేతల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీ నాయకుడు కావడం వల్లే..
బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మాధవ్ను ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. మాధవ్.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడు. పైగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నేత. చాలాకాలం నుంచి పార్టీలో ఉంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆయన శాసన మండలిలో అడుగు పెట్టారు. మాధవ్కే పార్టీ పగ్గాలను అప్పగించడానికి అన్ని అంశాలు కలిసి వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
Recommended Video
ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అదనపు బలం..
స్వతహాగా మాధవ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి వచ్చిన నాయకుడు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఆయనలో స్పష్టం కనిపిస్తుంటుంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండటం అదనను బలంగా మారుతుందని విశ్లేషకులు అంచనా. వివాదరహితుడని, అందర్నీ కలుపుకొని వెళ్లే మనస్తత్వం ఉండటం.. వంటి సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ జాతీయ అధిష్ఠానం మాధవ్ పేరునే ఖరారు చేయవచ్చని చెబుతున్నారు.