'సతీష్ రెడ్డి కొత్త శపథం విన్నారా..!', 'ముద్రగడ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు' : నారాయణ
కడప : టీడీపీ ప్రభుత్వ హామీలకు కట్టుబడి శపథాల మీద శపథాలు చేస్తున్నారు టీడీపీ నేత, మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన వెంటనే జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, త్వరితగతిన గండికోట రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తామని హామి ఇవ్వగా, ఆ హామికి కట్టుబడి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు తన గడ్డం, తల నీలాలు తీసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
దీంతో ఇప్పటివరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో, అప్పటినుంచి అంటే దాదాపుగా ఏడాదిన్నర క్రితం నుంచి గడ్డం పెంచుకునే తిరుగుతున్నారు సతీష్ రెడ్డి. అయితే తాజాగా సతీష్ రెడ్డి చేసిన మరో శపథం ఇప్పుడు ఆయన్ను మరోసారి వార్తల్లోకి ఎక్కించింది. ఇంతకీ ఆయన చేసిన తాజా శపథం ఏంటంటే.. జిల్లాలో ప్రాజెక్టులన్ని పూర్తయ్యేవరకు మాంసాహారం ముట్టుకోబోనని ప్రకటించారు.
సింహాద్రి నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సతీష్ రెడ్డి.
'ముద్రగడ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు' : నారాయణ
విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై మండిపడ్డారు ఏపీ మంత్రి నారాయణ. ఎవరి ప్రయోజనాల కోసం ముద్రగడ దీక్ష అని ప్రశ్నించిన ఆయన.. రౌడీ షీటర్ల కోసమా..? కాపుల కోసమా..? అని నిలదీశారు. కాపులను అడ్డం పెట్టుకుని ముద్రగడ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన నారాయణ, కాపులు ముద్రగడను 'ఛీ' కొడుతున్నారని చెప్పారు.
కాపులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, నిజంగా కాపుల కోసమే దీక్ష అయితే, అసలు దీక్ష చేయాల్సిన అవసరమే లేదని సూచించారు.