వాగ్వాదం వద్దు, చర్చకు సహకరించాలి: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: ప్రతి ఒక్క సభ్యుడు తమ అభిప్రాయాలను, తమ ప్రాంతానికి చెందిన ప్రజల మనోభావాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం శాసనమండలి సమావేశాలకు హాజరైన ఆయన తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరిగేందుకు మండలి సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఒకరు అభిప్రాయాలు చెబుతున్న సమయంలో ఇతర సభ్యులు అతను మాట్లాడేందుకు సహకరించాలని విజ్ఢప్తి చేశారు.
సున్నితమైన అంశం కాబట్టి బిల్లుపై చర్చించే సమయంలో వాగ్వాదాలకు పోకుండా తమ ప్రాంత ప్రజల సమస్యలను, అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన మండలి సభ్యులను కోరారు. బిల్లుపై తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని ఆయన సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
83 తర్వాత టి అభివృద్ధి చెందింది: రామచంద్రయ్య
1983 తర్వాత తెలంగాణ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందని రాష్ట్ర మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. ఆయన శాసనమండలిలో బిల్లుపై జరుగుతున్న చర్చలో పాల్గొని మాట్లాడారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టి విభజన చేయాలని కోరుకోవడం వల్ల అక్కడి ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. సెంటిమెంటుతో పోవద్దని, రాష్ట్ర విభజన మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం వారు కూడా సుఖంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
బిల్లుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి: యనమల
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. సభలో చర్చించేందుకు సమాచారం అందుబాటులో ఉండాలి కదా అని ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
వివిధ అంశాలపై సవరణ ప్రతిపాదనలను సభ్యులు ఛైర్మన్కు అందజేశారు. కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చర్చలో పాల్గొనకుండా సవరణ ప్రతిపాదనలు ఎలా ఇచ్చారో స్పష్టం చేయాలని ఛైర్మన్ను యనమల రామకృష్ణుడు కోరారు.