గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు: వారిద్దరు, వీరిద్దరు
తెలంగాణ ప్రాంతం నుంచి ఒకటి బీసీకి, మరొకటి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు ఆకుల లలితకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆకుల లలిత కోసం పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధికి సిఫారసు చేశారని తెలిసింది. బీసీ కావడంతో పాటు మహిళ కూడా కావడంతో రానున్న ఎన్నికల్లో పార్టీ ప్రయోజనకరంగా వుంటుందని డిఎస్ హైకమాండ్ వద్ద ప్రతిపాదించినట్టు సమాచారం.
ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ జి.చిన్నారెడ్డి పేరును ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాలని పార్టీ అధిష్టానవర్గం నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పార్టీ హైకమాండ్ గవర్నర్ కోటా కింద విడుదల చేసే అవకాశం వుంది. అయితే నాలుగింటిలో రెండు సీట్లను గవర్నర్ కోటా కింద సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించాలని పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. దాంతో ఒక స్థానాన్ని కాపు, బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పేరు ఖరారు చేయవచ్చునని అంటున్నారు. మరో స్థానాన్ని పిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజుకు ఇస్తారని అంటున్నారు.
ఇంతకు ముందు రెండు సార్లు కంతేటి సత్యనారాయణ రాజు శాసనమండలికి ఎన్నికయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఇరు ప్రాంతాల నుంచి దాదాపు నాలుగు పేర్లను పార్టీ అధిష్టానవర్గం ఖరారు చేసినప్పటికీ, చివరి క్షణంలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు చోటుచేసుకుంటే దాదాపుగా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిన పేర్లలో మార్పులు, చేర్పులు వుండే అవకాశాలు లేకపోలేదు.