ఆదివారమే మోదీ ఏపి పర్యటన..! నిరసన సెగ తప్పదా..??
Recommended Video
గుంటూరు/హైదరాబాద్ : ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ ఏపి పర్యటన పై ఉత్కంఠ నెలకొంది. మొన్న పలాసలో బహిరంగ సభను సైతం రద్దు చేసుకున్న బీజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా ఏపి పర్యటనను హడావిడిగా ముగించిన విషయం తెలిసిందే..! ఇక ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరగనున్న ప్రధాని నరేంద్రమోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి ఏమి చేశారనే అంశాలపై గుంటూరు సభలో ప్రధాని ప్రసంగం ఉంటుందని కన్నా చెప్పారు. ప్రధాని మోడీ సభను అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని, తమను ఇబ్బందులకు గురి చేస్తోందని కన్నా ఆరోపించారు. అయితే టీడీపీ ప్రభుత్వం, అధికార యంత్రాంగ ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూసినా మోడీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
గుంటూరులో ప్రకాష్ హోర్డింగ్స్ పై బ్యానర్లు కడుతుంటే లోకేష్ కార్యాలయం నుంచి బెదిరింపులు రావడం చాలా దారుణమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మన రాష్ట్రానికి దేశ ప్రధాని వస్తుంటే ఇలాంటి డ్రామా కంపెనీ ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని, దేశ ప్రధానికి స్వాగతం పలకలేని పరిస్ధితిలో చంద్రబాబు ఉండటం సిగ్గుచేటన్నారు. పేదరిక నిర్మూలన, దేశరక్షణ, గ్రామ వికాశాలపై శ్రద్ధ తీసుకున్న నరేంద్రమోడీ 130 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని కన్నా పేర్కొన్నారు. ఓబీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్ చేయించిన వ్యక్తి ప్రధాని మోడీ అని కన్నా కొనియాడారు. విభజన చట్టంలోని అంశాలు పది సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఉన్నా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసిన వ్యక్త మోడీ అని కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.