అవును.. ప్రధాని నన్ను కోరారు, ఇసుక ఫ్రీ.. డబ్బులడిగితే పీడీ యాక్టు పెట్టండి: చంద్రబాబు
ఇసుక ఉచితమని, ఎక్కడైనా డబ్బు వసూలు చేస్తే వారిపై పీడీ యాక్టు పెట్టాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.
అమరావతి: 'డిజిటల్ ఇండియా'కు సారథ్యం వహించమని ప్రధాని నరేంద్రమోడీ తనను కోరారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వెలగపూడిలో హెచ్ ఓడీలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ సమావేశంలో 'న్యూ ఇండియా' కార్యక్రమాన్ని ప్రకటించారని, సన్ రైజ్ ఏపీ, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ఇందులో భాగంగా చేస్తున్నామని చెప్పారు.
పశు సంవర్థక శాఖ ద్వారా ఆశించిన వృద్ధి సాధించే అవకాశం ఉందని, ఉద్యావన శాఖలో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించ లేకపోతున్నట్లు చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
''కఠిన చర్యలు తీసుకోండి''
ఇసుక మాఫియా దారుణాల గురించి మాట్లడుతూ.. ఇసుక ఉచితమని, ఉచిత ఇసుక విధానం సమర్థంగా అమలయ్యేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని, ఎక్కడైనా డబ్బు వసూలు చేస్తే పీడీ యాక్టు పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దీనిపై వెలగపూడిలో హెచ్ఓడీలతో ఆయన మాట్లాడుతూ ఇసుక సరఫరాపై మైనింగ్, రెవెన్యూ, హోం మంత్రులతో కలిసి డీజీపీ, సీసీఎల్ఏ,రెవెన్యూ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.