కెసిఆర్ అడుగుతారని, బీహార్ ఎన్నికల వల్లనే మోడీ ఇలా...
అమరావతి: నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్దిష్టమైన హామీలు ఇస్తూ ప్రకటన చేయకపోవడం వెనక గల కారణాలపై ఇప్పుడు అన్వేషణ సాగుతోంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఎపికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా వంటి విషయాల జోలికి వెళ్లకుండా ఆయన మాట్లాడారు
ఎపికి అండగా ఉంటామనే మాటతో సరిపెట్టారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర నిరాశకు గురి కాగా, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బిజెపి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా మోడీ ఏమీ ప్రకటించకపోవడంపై అసంతృప్తికి గురై ఉంటాయి. ఇంత భారీ కార్యక్రమంలో మోడీ ఎందుకు ఏమీ ప్రకటించలేదనే మథనం వారిలో సాగుతోంది.
వరాలు ప్రకటించకపోవడంతో విస్తుపోయినప్పటికీ తప్పనిసరిగా మోడీని వెనకేసుకు వస్తూ మట్లాడారు. ఎపికి బీహార్ కంటే మెరుగయిన ప్యాకేజీ ఇచ్చేవారనీ, అయితే అక్కడ ఇంకా ఎన్నికలు ముగియనందున ఆగాల్సి వచ్చిందని బిజెపి నాయకులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీకిచ్చే వరాలపై నీతి ఆయోగ్ ఇంకా నివేదిక పూర్తిచేయలేదని, అది కూడా ఒక కారణమని అంటున్నారు.
అదంతా ఒక ఎత్తయితే పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కనే ఉన్నారు. ఎపికి వరాలిస్తే తమ సంగతేమిటని కెసిఆర్ అడిగే అవకాశం ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా మోడీ ఎపికి ఏ విధమైన వరాలు ప్రకటించలేదని అంటున్నారు.