పవన్, జగన్లతో కలిసి ఏపీపై మోడీ కుట్ర: శివప్రసాద్, వైసీపీ ఎంపీలు జీతం ఎలా తీసుకుంటున్నారు?
Recommended Video
చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ మంగళవారం ఆరోపించారు. మనకు స్వచ్ఛ భారత్ కావాలని చెబుతారని, కానీ మోడీ మాత్రం స్వచ్ఛంగా ఉండరని మండిపడ్డారు.
బాబు ఇంటికింద తవ్వినా ఏదో ఒకటి బయటపడుతుంది, కూలదోస్తారా: పవన్, భార్య ప్రసవంపై ఎమోషనల్గా..
మూడేళ్లుగా రాజీనామాలు చేస్తామని చెబుతున్న వారు, ఇటీవల రాజీనామాలు చేసి, కొద్ది రోజుల క్రితం స్పీకర్ను కలిసి తమకు స్పీకర్ మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావనేదే వారి వ్యూహమన్నారు. రాజీనామాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రజల చెవుల్లో పూవులు పెడుతున్నారన్నారు.
ప్రజల చెవుల్లో ఇలా పూవులు పెడుతున్నారు
బీజేపీ, వైసీపీ ఎంపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని శివప్రసాద్ మండిపడ్డారు. జగన్ వారితో నాటకాలు ఆడిస్తున్నారన్నారు. ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ విమర్శిస్తూ సందర్భం వచ్చినప్పుడు ఒకదాని కంటే మరొక పెద్ద పూవు చెవిలో పెట్టుకొని ఇలా పూవులు పెట్టారని చూపించారు.
ఇక ఉప ఎన్నికలు రావు
జూన్ 4న ప్రధాని అధికారంలోకి వచ్చారని శివప్రసాద్ అన్నారు. 2019 జూన్ 4 వరకు ప్రధాని పదవి పూర్తవుతుందన్నారు. దీంతో 2018 జూన్ 4 నాటికి నాలుగేళ్లు పూర్తయిందని, ఇప్పుడు వారి రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు రావన్నారు. ఇలా మన చెవుల్లో పూవులు పెట్టారన్నారు. చంద్రబాబు కష్టపడి పని చేస్తుంటే వీళ్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు.
మోడీ తన పతనాన్ని అర్థం చేసుకోవాలి
నరేంద్ర మోడీ తన పతనాన్ని అర్థం చేసుకోవాలని శివప్రసాద్ అన్నారు. 2015 నుంచి తాము రాజీనామాలు చేస్తామంటూ వైసీపీ ఎంపీలు ఏపీ ప్రజల చెవుల్లో పూవులు పెడుతున్నారని శివప్రసాద్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీకి ప్రజలు పూవులు పెట్టడం ఖాయమన్నారు. ఏపీపై కుట్రలు చేస్తున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
జీతభత్యాలు ఎలా తీసుకుంటున్నారు?
అంతకుముందు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు విజయవాడలో మాట్లాడిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించకుండా కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుపై బురద జల్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న చంద్రబాబుకు సహకరించాల్సిపోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ పదవులకు రాజీనామా చేశామని చెప్పుకుంటున్న వైసీపీ ఎంపీలు జీతభత్యాలు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు.